షర్మిల వెంట సునీత.. జగన్ కు మరో తలనొప్పి

ఏపీలో రాజకీయ పరిణామాలు వేగంగా మారిపోతున్నాయి. ఎన్నికలు మరో రెండు నెలలకు వచ్చేసిన నేపథ్యంలో ఎవరి లెక్కలు వారివి అన్నట్లుగా పరిస్థితులు మారుతున్నాయి. వైఎస్ కుటుంబంలో చోటు చేసుకున్న తాజా పరిణామాలు కొత్త చర్చకు తెర తీస్తున్నాయి. ఇప్పటికే ఏపీ సీఎం జగన్ సోదరి షర్మిల ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలి హోదాలో అదే పనిగా విమర్శలు చేస్తుండటం తెలిసిందే. షర్మిల వ్యాఖ్యలపై వైసీపీ నేతలు కారాలు మిరియాలు నూరుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో షర్మిల వెంట నడిచేందుకు వైఎస్ వివేకానంద కుమార్తె సునీత కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు.

ఏపీ కాంగ్రెస్ అధ్యక్షరాలు హోదాలో సొంత జిల్లా కడపకు చేరుకుంటున్న షర్మిలతో.. సునీత భేటీ అవుతారని చెబుతున్నారు. ఈ రోజు ఇడుపులపాయ వేదికగా మారనుంది. ఈ భేటీ పూర్తిగా రాజకీయపూరితమని చెబుతున్నారు. తన తండ్రి వివేకానంద హత్యపై సునీత ఒంటరి పోరు చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రముఖ డాక్టర్ గా పేరున్న సునీత.. తన తండ్రి మరణానికి కారణమైన వారి మీద ఒత్తిళ్లను లెక్క చేయకుండా పోరు చేస్తున్న సంగతి తెలిసిందే.

ఆమె పోరాటంలో భాగంగా ఇప్పటికే పలువురు అరెస్టు అయ్యారు. కడప ఎంపీ అవినాష్ రెడ్డి తండ్రి భాస్కర్ రెడ్డితో పాటు ఇతరులు చంచల్ గూడ జైల్లో రిమాండ్ ఖైదీలు ఉన్నారు. తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎంపీ అవినాశ్ రెడ్డి మాత్రం బెయిల్ రావటంతో బయట ఉన్నారు. దీనిపై సునీత న్యాయపోరాటం చేస్తున్నారు. వివేకా హత్య కేసును సీబీఐ విచారణకు కోరిన అనంతరం ముఖ్యమంత్రి జగన్.. సునీత ఫ్యామిలీల మధ్య సంబంధాలు దెబ్బ తినటం తెలిసిందే.

ఈ తరుణంలో తమకు జరిగిన అన్యాయం మీద గళం విప్పేందుకు సునీత సిద్దంగా ఉన్నట్లుగా చెబుతున్నారు. ఇంతకాలం తాను ఒక్కరే పోరు చేస్తున్న సునీత.. ఈ అంశంపై మరింత బలాన్ని కూడగట్టుకునేందుకు కాంగ్రెస్ పార్టీలో చేరాలన్న ఆలోచన చేస్తున్నట్లుగా తెలుస్తోంది. నిజానికి.. సునీత చేసిన న్యాయపోరాటానికి షర్మిల తనవంతు సాయం చాలానే చేశారు. ఈ క్రమంలో ఇప్పుడు షర్మిల వెంట సునీత చేరటం ద్వారా తమ బలం మరింత పెరుగుతుందని భావిస్తున్నారు. నిప్పుకు గాలి తోడైతే అన్న చందంగా.. తాజా భేటీతో ఏపీ రాజకీయాల్లో మరిన్ని రాజకీయ పరిణామాలకు తెర లేవనుందని చెప్పక తప్పదు.