జంగా ముహూర్తం ఫిక్స్ చేసుకున్నారా ?

మాజీ ఎంఎల్ఏ, వైసీపీ ఎంఎల్సీ జంగా కృష్ణమూర్తి ముహూర్తం ఫిక్స్ చేసుకున్నారా ? అవుననే వినిపిస్తోంది రెండు ప్రధాన పార్టీల నుండి. 1999, 2004లో గుంటూరు జిల్లాలోని గురజాల నియోజకవర్గం నుండి కాంగ్రెస్ అభ్యర్ధిగా రెండుసార్లు ఎంఎల్ఏగా గెలిచారు. తర్వాత ఎన్నికల్లో టికెట్ దక్కలేదు. 2009లో వైసీపీలో చేరారు. 2014లో గురజాలలో పోటీచేసినా ఓడిపోయారు. అప్పటినుండి ఇప్పటివరకు ఫ్యాన్ పార్టీలోనే కంటిన్యు అవుతున్నారు. 2019 ఎన్నికల్లో టికెట్ దక్కలేదు. అయితే జంగాకు జగన్మోహన్ రెడ్డి ఎంఎల్సీ ఇచ్చారు.

వైసీపీలోని బీసీ వింగ్ లో జంగా కీలకంగా వ్యవహరిస్తున్నారు. రాబోయే ఎన్నికల్లో గురజాల టికెట్ కోసం అడిగారు. అయితే అందుకు జగన్ అంగీకరించలేదు. ప్రస్తుత ఎంఎల్ఏ కాసు మహేష్ రెడ్డికే టికెట్ దాదాపు ఖాయమైనట్లే అనుకోవాలి. వైసీపీలో టికెట్ రాదని నిర్ధారణ అయిన తర్వాత జంగా పార్టీపైన అలిగారు. కొద్దిరోజులుగా పార్టీ కార్యక్రమాల్లో ఎక్కడా కనబడటంలేదు. ఇదే సమయంలో తన సామాజికవర్గంలోని ముఖ్యులతో సమావేశమవుతున్నారు. తనకు గురజాలలో టీడీపీ టికెట్ ఖాయంచేస్తుందని చెప్పారట.

తాను టీడీపీలో చేరిన తర్వాత సామాజికవర్గం మద్దతుకోసమే వరసబెట్టి సమావేశాలు నిర్వహిస్తున్నారని పార్టీలో టాక్ నడుస్తోంది. జంగాను బుజ్జగించేందుకు పార్టీలోని ఎంతమంది కీలకనేతలు ప్రయత్నించినా ఎవరితోను జంగా మాట్లాడలేదట. రాజ్యసభ ఎంపీ మోపిదేవి వెంకటరమణ, సజ్జల రామకృష్ణారెడ్డి, లేళ్ళ అప్పిరెడ్డి చేసిన ఫోన్లకు జంగా స్పందించలేదని సమాచారం. దాంతో జంగా వైసీపీని వదిలేయాలని డిసైడ్ అయినట్లే అనే టాక్ పెరిగిపోతోంది. మరి టీడీపీలో గురజాలలో జంగాకు టికెట్ ఖాయమైందా అన్న విషయమై తమ్ముళ్ళు ఎవరు స్పష్టంగా చెప్పలేకపోతున్నారు.

ఈనెల 28వ తేదీన గుంటూరు జిల్లాలోని పొన్నూరులో రా కదలిరా బహిరంగసభ జరగబోతోంది. అందులో చంద్రబాబునాయుడు పాల్గొంటున్నారు. ఆ సభలోనే నరసరావుపేట వైసీపీ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయులు టీడీపీలో చేరబోతున్నట్లు సమాచారం. అదే సభలో లావుతో పాటు జంగా కూడా చేరాలని ముహూర్తం పెట్టుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. మరి చివరకు ఏమవుతుందో చూడాలి.