ఈసారైనా టీడీపీ గెలుస్తుందా ?

రాష్ట్రంలోని కొన్ని నియోజకవర్గాలు టీడీపీకి అందని ద్రాక్షపళ్ళు లాగ తయారయ్యాయి. అలాంటి నియోజకవర్గాల్లో గుంటూరు తూర్పు కూడా ఒకటి. చివరిసారిగా ఈ నియోజకవర్గంలో టీడీపీ గెలిచింది 1999 ఎన్నికల్లోనే. అప్పటినుండి ఇప్పటివరకు అంటే నాలుగు ఎన్నికల్లో టీడీపీ ఓడిపోతునే ఉంది. 1994-99 మధ్య అప్పటి సీనియర్ నేత లాల్ జాన్ భాష తమ్ముడు జియావుద్దీన్ గెలిచారు. మళ్ళీ ఎంతమంది ప్రయత్నించినా గెలుపు దక్కటంలేదు. మరి రాబోయే ఎన్నికల్లో టీడీపీ, జనసేన కూటమి తరపున ఏ పార్టీ అభ్యర్ధి పోటీచేయబోతున్నారో తెలీటంలేదు.

ఇక్కడ టీడీపీలో పెద్ద మైనస్ ఒకటుంది. అదేమిటంటే ప్రతి ఎన్నికలోను చంద్రబాబునాయుడు ఒక అభ్యర్ధిని పోటీలోకి దింపుతున్నారు. 1999 ఎన్నికల్లో సిట్టింగ్ ఎంఎల్ఏ జియావుద్దీన్ పోటీచేసి ఓడిపోయారు. ఆ తర్వాత మూడు ఎన్నికల్లో నజీర్, మద్దాలిగిరి, మొహ్మద్ నజీర్ పోటీచేశారు. ప్రతి ఎన్నికకు ఒక కొత్త అభ్యర్ధిని పోటీలోకి దింపుతుండటం వల్ల పార్టీ బాగా వీకైపోయింది. ద్వితీయ శ్రేణ నేతలతో పాటు క్యాడర్ కు కూడా పెద్ద ఆసక్తి ఉండదు. ఓడిపోయిన వాళ్ళనే మళ్ళీ ఎన్నికల్లో పోటీచేయిస్తే కాస్త సంపతి కూడా తోడవుతుందని చంద్రబాబుకు ఎందుకో అనిపించటంలేదు.

సరే, చరిత్రను వదిలేస్తే రాబోయే ఎన్నికల్లో టీడీపీ గెలవాలని చంద్రబాబు గట్టిగానే డిసైడ్ అయ్యారని తమ్ముళ్ళు చెబుతున్నారు. అందుకు తగ్గట్లే పార్టీని గెలిపించే గట్టి నేతల కోసం సర్వేలు మొదలుపెట్టారట. గడచిన రెండు ఎన్నికల్లో వైసీపీ తరపున గెలిచిన ముస్తాఫాకు రాబోయే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి టికెట్ నిరాకరించారు.

అందుకనే ఎన్నికల్లో ఆయన కూతురు నూరీ ఫాతిమా పోటీచేయబోతున్నారు. కాబట్టి రాబోయే ఎన్నికల్లో టీడీపీ తరపున గట్టి మహిళా అభ్యర్ధిని పోటీలోకి దింపితే ఎలాగుంటుందని చంద్రబాబు ఆలోచిస్తున్నారట. అయితే అసలు ఈ నియోజకవర్గంలో టీడీపీ పోటీచేస్తుందా లేకపోతే జనసేన చేస్తుందా అనే కన్ఫ్యూజన్ పెరిగిపోతోంది. జనసేన పోటీచేస్తే అభ్యర్ధి ఎవరన్నది అధినేత పవన్ కల్యాణ్ డిసైడ్ చేస్తారు. అదే టీడీపీ పోటీచేస్తే మహిళా అభ్యర్ధిని పోటీలోకి దింపాలని డిసైడ్ అయ్యారని సమాచారం. మరి రాబోయే ఎన్నికల్లో అయినా చంద్రబాబు వ్యూహం వర్కవుటవుతుందా ?