బీఆర్ఎస్ వీకైపోతోందా?

తొందరలో జరగబోయే పార్లమెంటు ఎన్నికల్లో మెజారిటి సీట్లు గెలవాలని ఒకవైపు కేసీయార్ టార్గెట్ పెట్టుకుంటే మరోవైపు బీఆర్ఎస్ వీకైపోతోందనే ప్రచారం బాగా పెరిగిపోతోంది. పదేళ్ళు తిరుగులేకుండా అధికారం చెలాయించిన బీఆర్ఎస్ కు మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి రూపంలో పెద్ద దెబ్బపడింది. అధికారంలో ఉన్నపుడు బలంగా కనిపించిన పార్టీ ఓటమి తర్వాత అంతా డొల్లగా కనబడుతోంది. దీనికి రెండు కారణాలున్నాయి. మొదటిదేమో పార్టీని కట్టుదిట్టంగా నడిపించే సామర్ధ్యం కేటీయార్ కు లేదనే ప్రచారం పెరిగిపోతోంది.

ఫలితాలు వచ్చిన రెండోరోజే కేసీయార్ తుంటిఎముక విరగటంతో ఆసుపత్రి పాలయ్యారు. ఆపరేషన్ జరిగిన తర్వాత ఆరువారాలపాటు విశ్రాంతి తీసుకోవాలని డాక్టర్లు సూచించారు. దాంతో కేసీయార్ మంచానికే పరిమితమైపోయారు. అప్పటి నుండి పార్టీ వ్యవహారాలను కేటీయారే చూసుకుంటున్నారు. పార్లమెంటు ఎన్నికలు దగ్గరకు వచ్చేస్తున్నాయి కాబట్టి నియోజకవర్గాల వారీగా కేటీయార్ సమీక్షలు జరుపుతున్నారు. ఈ సమీక్షల్లో గెలిచిన వారు, ఓడినవారంతా పార్టీపైన బహిరంగంగానే వ్యాఖ్యలు చేస్తున్నారు.

ప్రజా వ్యతిరేకత ఎదుర్కొంటున్న సిట్టింగులకు టికెట్లు ఇవ్వటం వల్లే పార్టీ ఓడిందని, సిట్టింగుల్లో చాలామంది ద్వితీయశ్రేణినేతలు, క్యాడర్ ను అసలు పట్టించుకోలేదని, జనాల్లో పెరిగిపోయిన వ్యతిరేకతను గుర్తించలేదని, సంక్షేమపథకాల పంపిణీలో అవకతవకలు, అరాచకాలు పెరిగిపోవటంతోనే పార్టీ ఓడిపోయిందని రకరకాలుగా బహిరంగంగానే చెప్పేస్తున్నారు. దీనికి అదనంగా కేటీయార్ కూడా రోజుకో రకంగా మాట్లాడుతు పార్టీలో గందరగోళం సృష్టిస్తున్నారు. పార్టీ నేతలను కలుపుకోవటంలో ఫెయిలయ్యామని, ఒకసారి, సిట్టింగుల్లో వ్యతిరేకత ఉన్న వాళ్ళని మార్చుంటే బాగుండేదని మరోసారి అంగీకరించారు. దాంతో పార్టీలో గందరగోళం పెరిగిపోతోంది.

కొందరు ఎంఎల్ఏల వైఖరి వల్లే పార్టీ ఓడిపోయిందని కవిత కూడా ధ్వజమెత్తారు. తననే ద్వితీయశ్రేణి నేతలు, క్యాడర్ను కలవనీయకుండా కొందరు ఎంఎల్ఏలు అడ్డుకున్నారని కవిత చేసిన వ్యాఖ్యలు సంచలనంగా  మారాయి. కేసీయార్ మంచాన పడటంతోనే నేతలకు ధైర్యం వచ్చినట్లుంది. పార్టీలో నేతల వైఖరి చూస్తుంటే రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో అభ్యర్ధుల గెలుపుకు ఎంతమంది పనిచేస్తారు అనే డౌట్లు పెరిగిపోతున్నాయి. దీనికి అదనంగా మున్సిపాలిటీల్లో అవిశ్వాస తీర్మానాలు పెట్టి బీఆర్ఎస్ ఛైర్మన్లను దింపేస్తున్నారు. కౌన్సిలర్లు రాజీనామాలు చేసి కాంగ్రెస్ లో చేరిపోతున్నారు. ఒకరకంగా బీఆర్ఎస్ లో గందరగోళం పెరిగిపోతోంది. దాంతో పార్టీ బాగా బలహీనపడిపోయిందా  అనే అనుమానాలు పెరిగిపోతున్నాయి.