పక్కా ప్లాన్ తో రెడీ అవుతోందా ?

తొందరలోనే జరగబోతున్న పార్లమెంటు ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ పక్కా వ్యూహంతో రెడీ అవుతోంది. కాంగ్రెస్ ప్రభుత్వం వేస్తున్న ప్రతి అడుగు ఆచితూచి వేస్తోంది. ప్రతి అడుగులోను జనాలను ఆకర్షించటమే టార్గెట్ గా ముందుకు వెళుతోంది. ప్రజాపాలన, అభయహస్తం, లబ్దిదారుల ఎంపికకు గ్రామసభలు, ప్రగతిభవన్లో ప్రజావాణి కార్యక్రమం నిర్వహించటం లాంటి అనేక కార్యక్రమాలను ప్రజాధరణను దృష్టిలో పెట్టుకునే చేసింది. అలాగే ఆరోగ్యశ్రీ పరిధిని రు. 10 లక్షలకు పెంచటం, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించటం కూడా ఇందులో భాగమే.

ఏ పనిచేసినా, ఏ నిర్ణయం తీసుకున్నా జనాకర్షణే ధ్యేయంగా చేస్తోంది. ఎందుకంటే రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో అత్యధిక సీట్లు గెలుచుకోవాలన్నదే రేవంత్ రెడ్డి టార్గెట్. ప్రతిపక్షాలు బీఆర్ఎస్, బీజేపీని చావుదెబ్బకొట్టాలన్నది రేవంత్ టార్గెట్ గా కనబడుతోంది. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచినా అదేమంత గొప్ప విజయం కాదన్నది అందరికీ తెలిసిందే. ఎలాగంటే 119 సీట్ల అసెంబ్లీలో ప్రభుత్వం ఏర్పాటుకు అవసరమైన మ్యాజిక్ ఫిగర్ 60 సీట్లు. 60 సీట్లు దాటిన పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది.

ఈ పద్దతిలో చూస్తే కాంగ్రెస్ కు వచ్చింది కేవలం 64 సీట్లు అంటే నాలుగు సీట్లు మాత్రమే అదనంగా వచ్చింది. ఇదేమంత గొప్ప మెజారిటి కాదనే చెప్పాలి. అదే 70 సీట్లు దాటుంటే అప్పుడు మంచి విజయమని చెప్పుకోవచ్చు. దీన్ని దృష్టిలో పెట్టుకునే రాబోయే లోక్ సభ ఎన్నికల్లో మంచి విజయం సాధించాలని రేవంత్ టార్గెట్ పెట్టుకున్నారట.

ఇపుడున్న 19 సీట్లలో కాంగ్రెస్ బలం సున్నా. నిజానికి 2019 లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ మూడు సీట్లలో గెలిచింది. అప్పట్లో ఎంపీలుగా గెలిచిన రేవంత్, ఉత్తమ్, కోమటిరెడ్డి వెంకటరెడ్డి మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఎంఎల్ఏలుగా గెలిచారు. అందుకనే ఎంపీలుగా రాజీనామాలు చేశారు. దాంతో తెలంగాణా నుండి కాంగ్రెస్ కు ఒక్క ఎంపీ కూడా లేరు. అందుకనే రాబోయే ఎన్నికల్లో కనీసం 10 సీట్లకు తక్కువ కాకుండా గెలవాలని ప్లాన్ చేస్తున్నారట. చివరకు ఏమవుతుందో చూడాలి.