కిక్కిరిసిన తాడేప‌ల్లి.. క్యూ క‌ట్టిన ఎమ్మెల్యేలు!

ఏపీ సీఎం జ‌గ‌న్ నివాసం ఉన్న తాడేప‌ల్లికి వైసీపీకి చెందిన ఎమ్మెల్యేలు క్యూ క‌ట్ట‌డంతో తాడేప‌ల్లి ప్రాంతం మొత్తం కిక్కిరిసిపోయింది. ఒకరు కాదుఇద్ద‌రు కాదు.. ఏకంగా.. ప‌దుల సంఖ్య‌లో ఎమ్మెల్యేలు సీఎం ఇంటికి క్యూ క‌ట్టారు. పలు నియోజకవర్గాల్లో వైసీపీ ఇన్‌ఛార్జీల మార్పుపై కసరత్తు కొనసాగుతున్న నేప‌థ్యంలో త‌మ‌కు మ‌రో ఛాన్స్ ఇవ్వాల‌నే అభ్య‌ర్థ‌న‌ను నేరుగా అధినేత‌కే విన్న‌వించేందుకు చాలా మంది ఎమ్మెల్యేలు తాడేపల్లి క్యాంపుకార్యాల‌యానికి చేరుకున్నారు. వీరిలో కొంద‌రికే పార్టీ అధినేత నుంచి పిలుపు అంద‌గా.. మ‌రికొంద‌రు సొంత‌గానే చేరుకున్నారు.

విశాఖ ద‌క్షిణం ఎమ్మెల్యే(ఈయ‌న టీడీపీ నుంచి వ‌చ్చి వైసీపీలో చేరారు) వాసుపల్లి గణేష్, పెందుర్తి ఎమ్మెల్యే అదీప్ రాజు, ఏలూరు జిల్లా దెందులూరు ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి, కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి సీఎం క్యాంపు కార్యాలయానికి వెళ్లారు. వీరితోపాటు క‌ర్నూలు జిల్లా పాణ్యం, నంద్యాల‌, క‌ర్నూలు ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు. లెక్క‌కు మించి ఎమ్మెల్యేలు రావ‌డంతో కార్యాల‌యంలో భారీ సంద‌డి నెల‌కొంది.

సీఎం క్యాంపు కార్యాలయంలో మంత్రి, రీజినల్ కో ఆర్డినేటర్ పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డి ఎమ్మెల్యేల‌తో చ‌ర్చిస్తున్నారు. ఇక‌, సీటు మార్పు విషయంపై కీల‌క స‌మ‌న్వ‌య క‌ర్త‌ ధనుంజయరెడ్డిని వైసీపీ ముఖ్య నేతలు, ఎమ్మెల్యేలు కలుస్తున్నారు. మరోసారి తమకు అవకాశం ఇవ్వాలని ఎమ్మెల్యేలు కోరుతున్నారు. ఎమ్మెల్యేల గ్రాఫ్, సీట్ల మార్పుకు గల కారణాలు వారికి పార్టీ సీనియర్లు వివరిస్తున్నారు. ఇదిలావుంటే మ‌రోవైపు.. రాజ్య‌స‌భ స‌భ్యుడు, ప్ర‌కాశం, నెల్లూరు జిల్లాల ఇంచార్జి వి. విజ‌య‌సా యిరెడ్డి క్షేత్ర‌స్థాయిలో మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస‌రెడ్డి, మంత్రి ఆదిమూల‌పు సురేష్ స‌హా ప‌లువురు నాయ‌కుల‌తో భేటీ అయ్యారు. అంత‌ర్గ‌త చ‌ర్చ‌లో పార్టీని బ‌లోపేతం చేయ‌డం, టికెట్ల వ్య‌వ‌హారం.. వంటివాటినిక్షేణ్ణంగా వివ‌రించిన‌ట్టు తెలిసింది.