లోకేష్ కు షర్మిల క్రిస్మస్ గిఫ్ట్..జగన్ కు షాక్

కొంతకాలంగా ఏపీ సీఎం వైఎస్ జగన్, ఆయన సోదరి వైఎస్ షర్మిలల మధ్య విభేదాలు వచ్చాయన్న ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఆ ప్రచారానికి తగ్గట్లుగానే ఇడుపులపాయలో తమ తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి, వర్ధంతి సందర్భంగా అన్నాచెల్లెళ్లు విడివిడిగానే నివాళులు అర్పిస్తున్నారు. తాజాగా షర్మిల చేసిన పనితో ఆ విభేదాలు మరింత ముదిరాయని తెలుస్తోంది. రాబోయే ఎన్నికల నేపథ్యంలో జగన్ వర్సెస్ లోకేష్ అన్న రీతిలో మాటల యుద్ధం జరుగుతున్న క్రమంలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కు షర్మిల క్రిస్మస్ గిఫ్ట్ లు పంపిన వైనం సంచలనం రేపుతోంది.

జగన్ కు తనకు తీవ్ర స్థాయిలో విభేదాలున్నాయి అన్న విషయాన్ని కన్ఫమ్ చేసేలాగా షర్మిల చేసిన తాజా పని రాష్ట్ర రాజకీయాలలో హాట్ టాపిక్ గా మారింది. ఆ గిఫ్ట్ లు స్వీకరించిన లోకేష్ దాని ఫోటో ట్విటర్ లో షేర్ చేసి షర్మిలకు ధన్యవాదాలు తెలుపుతూ ట్వీట్ చేశారు. నారా కుటుంబ సభ్యులు తరఫున షర్మిలకు లోకేష్ శుభాకాంక్షలు చెప్పారు. జగన్ రాజకీయ ప్రత్యర్థి అయిన లోకేష్ కు ఆయన సోదరి షర్మిల గిఫ్టులు పంపిన వ్యవహారం సంచలనం రేపుతోంది. దాంతోపాటు త్వరలోనే ఏపీలో కాంగ్రెస్ పార్టీ తరఫున షర్మిల యాక్టివ్ కాబోతున్నారన్న ప్రచారం కూడా వైసీపీ నేతలను ఇరుకున పెడుతుంది.

అన్నయ్య జగన్ కు కనీసం క్రిస్మస్ శుభాకాంక్షలు చెప్పని షర్మిల…ఆయన ప్రత్యర్థి లోకేష్ కు క్రిస్మస్ గిఫ్ట్ లు పంపడం జగన్ ను ఘోరంగా అవమానించినట్లేనని, వారిద్దరి మధ్య విభేదాలు తారస్థాయిలో ఉన్నట్టుగా ఈ విషయం రుజువు చేస్తుందని సోషల్ మీడియాలో కామెంట్లు వస్తున్నాయి. మరి, లోకేష్ కు షర్మిల క్రిస్మస్ గిఫ్ట్ వ్యవహారంపై వైసీపీ నేతల స్పందన ఏ విధంగా ఉంటుందన్న ఆసక్తి ఏర్పడింది.