28 పార్టీలకు ఇష్టమైన వ్యక్తి ఎవరు?

28 పార్టీలు కలిసి ఏర్పాటుచేసుకున్న ‘ఇండియా కూటమి’ తరపున ప్రధానమంత్రి అభ్యర్ధిగా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే పేరు తెరమీదకు వచ్చింది. ఖర్గే పేరును పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జీ ప్రతిపాదిస్తే ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మద్దతిచ్చారు. ప్రధానమంత్రి అభ్యర్ధిగా ఖర్గే పేరును మమత ప్రతిపాదించటం, కేజ్రీవాల్ మద్దతివ్వటం ఆశ్చర్యంగా ఉంది. దీనికి మెజారిటి నేతలు అంగీకరించారు. అయితే బీహార్ సీఎం నితీష్ కుమార్, మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ వ్యతిరేకించారట.

అందుకనే తన పేరును ప్రతిపాదించినందకు ఖర్గే ధన్యవాదాలు చెబుతునే ముందు అధికారంలోకి వచ్చే విషయమై వ్యూహాలు సిద్ధం చేసుకుందామని ఖర్గే సర్దిచెప్పారు. రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీ నాయకత్వంలోని ఎన్డీయేని ఎలా ఎదుర్కోవాలనే విషయమై వ్యూహాలపై చర్చించేందుకు కూటమిలోని 28 పార్టీల అధినేతలు హాజరయ్యారు. సమావేశంలో సోనియా, రాహుల్, ప్రియాంకతో పాటు నితీష్, లాలు, శరద్ పవార్, మమత, ఉద్ధవ్ ఠాక్రే, స్టాలిన్ లాంటి ప్రముఖ నేతలంతా హాజరయ్యారు.

రాబోయే ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్ధులపై వన్ ఆన్ వన్ అనే ప్రాతిపదికన ఇండియా కూటమి అభ్యర్ధులు పోటీచేయాలన్నది నితీష్ ప్రతిపాదన. ఇది ఎంతవరకు వర్కవుటవుతుందో చూడాలి. అయితే సడెన్ గా ప్రధాని అభ్యర్ధిగా ఖర్గే పేరును మమత ప్రతిపాదించటమే ఆశ్చర్యంగా ఉంది. అయితే ఇందులో లోతైన వ్యూహం కూడా ఉన్నది. అదేమిటంటే ఎన్డీయే తరపున నరేంద్రమోడీనే ప్రధానమంత్రి అభ్యర్ధిగా ఉంటారు. కాబట్టి ఇండియా కూటమి తరపున ఒక ఎస్సీ నేతను ప్రతిపాదిస్తే బాగుంటుందని అనుకున్నట్లున్నారు.

ఖర్గేని ప్రధాని అభ్యర్ధిగా ప్రతిపాదించిన ఇండియా కూటమికి దేశంలోని ఎస్సీలందరు మద్దతుగా నిలబడతారని మెజారిటి నేతలు అనుకుంటున్నారు. బీసీల్లో మెజారిటిని తమ వైపు లాక్కోవాలని ఎన్డీయే ఆలోచిస్తున్న నేపధ్యంలో ఎస్సీలను ఆకర్షించేందుకే ఖర్గే పేరును మమత ప్రతిపాదించినట్లు తెలుస్తోంది. దేశంలో ఏ రాష్ట్రంలో తీసుకున్నా బీసీ, ఎస్సీ సామాజికవర్గాలే గెలుపోటముల్లో నిర్ణయాత్మక శక్తిగా ఎదుగుతున్న విషయాన్ని అందరు చూస్తున్నదే. బీసీల్లో మెజారిటి సెక్షన్లు ఎన్డీయే వైపు ఉన్నారన్నది వాస్తవం. అందుకనే ఎస్సీల మద్దతు కూడగట్టేందుకే ఖర్గేని ప్రధాని అభ్యర్ధిగా ప్రతిపాదించింది. మరి చివరకు ఏమవుతుందో చూడాలి.