ముగిసిన యువగళం..పైలాన్ ఆవిష్కరించిన లోకేష్

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర దిగ్విజయంగా ముగిసింది. విశాఖ జిల్లా అగనంపూడిలో పైలాన్ ఆవిష్కరించి పాదయాత్రకు లోకేష్ ముగింపు పలికారు. 226 రోజులపాటు కొనసాగిన పాదయాత్రకు ఈ రోజుతో పుల్ స్టాప్ పడింది. జనవరి 27న లోకేష్ పాదయాత్ర ప్రారంభించి డిసెంబర్ 18న ముగించారు. మధ్యలో చంద్రబాబు అరెస్ట్, ఎమ్మెల్సీ ఎన్నికలు వంటి కారణాల నేపథ్యంలో దాదాపు నెలన్నర రోజులపాటు పాదయాత్రకు బ్రేక్ పడింది.

ఇక, లోకేష్ పాదయాత్ర ముగింపు సందర్భంగా అగనంపూడి జనసంద్రమైంది. రాష్ట్ర నలుమూలల నుంచి టీడీపీ, జనసేన శ్రేణులు రావడంతో గాజువాక ప్రాంతం కిక్కిరిసిపోయింది. గాజువాక నియోజకవర్గం జీవీఎంసీ వడ్లమూడి జంక్షన్ నుంచి లోకేష్ పాదయాత్ర ప్రారంభించి శివాజీనగర్ దగ్గర ముగించారు. లోకేష్ వెంట నారా భువనేశ్వరి, అత్త నందమూరి వసుంధరాదేవి, బాలకృష్ణ చిన్న కూతురు తేజశ్విని, లోకేష్ తోడల్లుడు భరత్, ఇతర కుటుంబసభ్యులు పాదయాత్రలో నడిచారు. శివాజీనగర్ వద్ద పైలాన్‌ను లోకేష్ ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా జగన్ పై లోకేష్ విమర్శలు గుప్పించారు. నియంతృత్వంపై ప్రజా యుద్ధమే యువగళమని, అణచివేతకు గురైన వర్గాలకు యువగళం గొంతుకైందని, యువతకు భరోసానిచ్చిందని చెప్పారు. పాదయాత్రలో తాను ఇచ్చిన ప్రతి హామీకి కట్టుబడి ఉంటానని చెప్పారు. పాదయాత్రలో పాల్గొన్న వారికి, సహకరించిన వారికి ధన్యవాదాలు తెలిపారు.

ఒక అసమర్థుడు గద్దెనెక్కి ప్రజాస్వామ్యంపై దాడి చేశాడని, ఆ దాడిని తాను కళ్ళారా చూశానని జగన్ ను ఉద్దేశించి లోకేష్ షాకింగ్ కామెంట్స్ చేశారు. ఇక, లోకేష్ మొత్తం పాదయాత్రలో 3132 కిలోమీటర్లు నడిచారు. 97 అసెంబ్లీ నియోజకవర్గాలలో యాత్ర సాగింది. వాస్తవానికి 4000 కిలోమీటర్ల మేర యువగళం సాగాల్సి ఉంది. అయితే. ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో చంద్రబాబు అరెస్టుతో నెలన్నర రోజులు పాదయాత్రకు బ్రేక్ పడిన నేపథ్యంలో ముందుగానే లోకేష్ తన పాదయాత్రను ముగించాల్సి వచ్చింది.