రేవంత్‌పై కాంగ్రెస్ సాహ‌సం వెనుక‌.. కీల‌క విష‌యాలు ఇవే…!

ఒక జాతీయ పార్టీలో అందునా అంత‌ర్గ‌త ప్ర‌జాస్వామ్యం అధికంగా ఉన్న‌ కాంగ్రెస్ పార్టీలో ఒక రాష్ట్రానికి ముఖ్య‌మంత్రి కావ‌డం అనేది అంత తేలిక విష‌యం కాదు. ఉదాహ‌ర‌ణ‌కుక ‌ర్ణాట‌క రాష్ట్రం తీసుకుంటే.. ఈ ఏడాది మేలో జ‌రిగిన ఎన్నికల త‌ర్వాత‌.. ముఖ్య‌మంత్రి ఎంపిక చేసేందుకు దాదాపు 15 రోజుల స‌మ‌యం ప‌ట్టింది. అది కూడా.. ఇద్ద‌రు ముఖ్య నాయ‌కులు, పార్టీలో సుదీర్ఘ కాలంగా ఉన్న నాయ‌కుల మ‌ధ్యే పోటీ ఏర్ప‌డింది. అలాంటిది.. ఒక ర‌కంగా.. నిన్న‌గాక మొన్న పార్టీలోకి వ‌చ్చిన రేవంత్ రెడ్డిని ఎంపిక చేయ‌డం.. ఎంతో మంది సీనియ‌ర్ల‌ను కూడా ప‌క్క‌న పెట్ట‌డం అంటే.. కాంగ్రెస్ చాలా సాహ‌సమే చేసింది.

ఈ విష‌యంలో ఏకీకృత నిర్ణ‌యం అనేక‌న్నా.. ఏక‌ప‌క్ష నిర్ణ‌యం అన‌డంలో ఎలాంటి సందేహం లేదు. ఎందుకంటే.. ఏకీకృత నిర్ణ‌యం వ‌చ్చి ఉంటే.. అది ఆదివార‌మే(ఎన్నిక‌ల ఫ‌లితం వ‌చ్చిన‌నాడే) జ‌రిగి ఉండాలి. కానీ, అలా జ‌ర‌గ‌లేదు. రెండు రోజుల పాటు సుదీర్ఘ చ‌ర్చ‌లు, మంత‌నాలు, వార్ రూమ్ డిబేట్లు.. బుజ్జ‌గింపులు.. లాలింపులు వంటివి అనేకం తెర‌మీదికివ‌చ్చాయి. చివరాఖ‌రుకు జ‌రిగింది రాహుల్ ఏక‌ప‌క్ష నిర్ణ‌యంతో రేవంత్‌రెడ్డి సీఎం సీటును ఎక్క‌గ‌లిగారు. క‌ట్ చేస్తే.. రాహుల్ కైనా.. పార్టీ అధిష్టానానికైనా.. రేవంత్ ను ఎన్నికోవ‌డం వెనుక చేసిన సాహసానికి చాలానే కార‌ణాలు క‌నిపిస్తున్నాయి.

ప్ర‌ధానంగా బెరుకులేని బ‌లమైన గ‌ళం రేవంత్‌కు సొంతం కావ‌డం. ప్ర‌త్య‌ర్థి ఎవ‌ర‌నేది ఆయ‌న‌కు అన‌వ‌స‌రం.. త‌న పార్టీ ప్ర‌యోజ‌నాలు.. అదేస‌మ‌యంలో ప్రజా ప్ర‌యోజ‌న‌మే గీటురాయిగా రాజ‌కీయాలు చేశారు. ఇటీవ‌ల కాలంలో కాంగ్రెస్‌లో ఇంత బ‌ల‌మైన నాయ‌కుడు క‌నిపించ‌లేదు. వైఎస్ త‌ర్వాత‌.. ఆ స్థాయిలో రాజ‌కీయాలు చేయ‌గ‌ల నాయ‌కుడు లేడ‌ని త‌ర్జ‌న భ‌ర్జ‌న ప‌డుతున్న స‌మ‌యంలో అంద‌రినీ ఏక‌తాటిపైకి తీసుకువ‌చ్చిన రేవంతే .. చుక్కాని కావ‌డం.. కాంగ్రెస్‌లో ఆయ‌న ప‌దివిని ప‌దిలం చేసింది. అంతేకాదు.. మ‌రో కీల‌క కార‌ణం.. ట్ర‌బుల్ షూట‌ర్‌!

స‌మ‌స్య వ‌స్తే.. (ఎందుకంటే..కాంగ్రెస్ లో అంత‌ర్గ‌త కుమ్ములాట‌లు ఎక్కువ‌) దానిని సాధ్య‌మైనంత వేగంగా ప‌రిష్క‌రించే నేర్పు రేవంత్‌కు ఉంది. గ‌తంలో తాను పీసీసీ చీఫ్ అయిన‌ప్పుడు వ‌చ్చిన అనేక విమ‌ర్శ‌ల‌ను ఆయ‌న త‌న‌కు అనుకూలంగా మార్చుకుని.. గాంధీ భ‌వ‌న్ కు రాను అన్న నాయ‌కుల‌ను ర‌ప్పించారు. రేవంత్ అంటే ఎవ‌రు ? అన్న వారితోనే రేవంత‌న్న అని అనిపించుకున్న దిట్ట‌. సో.. ఈ ప‌రిణామాలే ఆయ‌న‌ను ట్ర‌బుల్ షూట‌ర్‌గా నిల‌బెట్టాయి. ఇక‌, వ‌చ్చే పార్ల‌మెంటు ఎన్నిక‌ల్లో కేసీఆర్ వంటి బ‌ల‌మైన నాయ‌కుడిని మ‌రోసారి ఎదుర్కొనాల్సి రావ‌డం.. కాంగ్రెస్‌కు అవ‌స‌రం . ఈ నేప‌థ్యంలో రేవంత్ వంటి బ‌ల‌మైన నాయ‌కుడిని ప‌క్క‌న పెడితే.. కేసీఆర్‌కు చాన్స్ ఇచ్చిన‌ట్టే అవుతుంద‌ని అధిష్టానం భావించింది. ఈ క్ర‌మంలోనే ఏకీకృత నిర్ణ‌యం కాకుండా.. ఏక‌ప‌క్ష నిర్ణ‌యం దిశ‌గానే అడుగులు వేసింది.