అమ‌రావ‌తికి డ‌బ్బే డ‌బ్బు.. మాట‌లు కాదు చేత‌లే!

ఏపీ రాజ‌ధాని అమ‌రావ‌తికి నిన్న మొన్న‌టి వ‌ర‌కు.. డ‌బ్బులు ఇచ్చే వారి కోసం స‌ర్కారు ఎదురు చూసింది. గ‌త వైసీపీ పాల‌న‌లో మూడు రాజ‌ధానుల పేరుతో అమ‌రాతిని ముర‌గబెట్ట‌డంతో అంచ‌నా వ్య‌యం పెరిగిపోయింది. దీనికి తోడు అన్ని శాఖ‌ల్లోనూ అప్పులు పేరుకుపోయాయి. దీంతో స్వ‌యంగా రాజ‌ధానిని నిర్మించ‌లేక‌.. కేంద్రం నుంచి సాయం తెచ్చుకునే ప్ర‌య‌త్నాలు చేశారు. అయితే.. కేంద్రం త‌ను ఇచ్చేదానికంటే కూడా.. ప్ర‌పంచ బ్యాంకు, ఆసియా అభివృద్ది బ్యాంకు వంటి ప్ర‌పంచ స్థాయి సంస్థ‌ల‌తో సాయం అందిస్తోంది.

ఈ క్ర‌మంలో ఇప్ప‌టి వ‌ర‌కు ఈ నెల‌లో 3వేల‌కోట్ల రూపాయ‌ల‌పై చిలుకు మొత్తం రాజ‌ధానికి అందింది. దీంతో ప‌నులు ప్రారంభించేందుకు ప్ర‌భుత్వం రెడీ అయింది. అయితే.. ఇప్పుడు ప‌నుల జోరును చూస్తున్న దేశీయ బ్యాంకులు కూడా.. క్యూ క‌డుతున్నాయి. మేం ఇస్తామంటే.. మేం ఇస్తామంటూ.. నిధులు ఇచ్చేందుకు ముందుకు వ‌చ్చాయి. వీటిలో ఎస్‌బీఐ, యూనియ‌న్ బ్యాంకు వంటి జాతీయ దిగ్గజ బ్యాంకులు ఉండ‌డం గ‌మ‌నార్హం.

వీటి ద్వారా సుమారు మ‌రో 26 వేల కోట్ల వ‌ర‌కు అందే అవ‌కాశం ఉంద‌ని ప్ర‌భుత్వం లెక్క‌లు వేసుకుంది. తాజాగా వీటిపై స‌మీక్షించిన సీఎం చంద్ర‌బాబు రుణాలు ఇచ్చే వారు పెడుతున్న ష‌ర‌తుల‌ను కూడా ప‌రిశీలించాల‌ని, రాష్ట్ర ప్ర‌జ‌ల‌పై భారాలు మోపే విధంగా ఉంటే.. ఎలాంటి అప్పులు కూడా తీసుకోవ‌ద్ద‌ని సీఆర్ డీఏ అధికారుల‌కు తెగేసి చెప్పారు. అంతేకాదు.. స్వ‌ల్ప మొత్తాలతో కూడిన‌.. వ‌డ్డీల‌కే తీసుకోవాల‌ని కూడా.. సూచించారు.

ఎందుకిలా?

నిన్న మొన్న‌టి వ‌ర‌కు అస‌లు అమ‌రావ‌తికి రుణం అంటే.. మొహం చాటేసిన బ్యాంకులు ఇప్పుడుక్యూ క‌ట్టుకుని మ‌రీ ముందుకు రావ‌డం ఎందుకు?  దీని వెనుక ఏంజ‌రిగింద‌న్న చ‌ర్చ సహజం ఈ కోణంలో చూస్తే..రాష్ట్రంలో పెట్టుబడులు పెరుగుతున్నాయి. వాణిజ్య కార్య‌క‌లాపాలు పెరుగుతున్నాయి. రుణాలు ఇచ్చినా తీర్చ‌గ‌లిగే శ‌క్తి రాష్ట్రం పుంజుకుంది. ముఖ్యంగా అమ‌రావ‌తిలో ప్ర‌పంచ స్థాయి సంస్థ‌లు వ‌స్తున్నాయి. వీటి వ‌ల్ల కార్య‌కలాపాలు మ‌రింత పెరుగుతాయి. ఈ ప‌రిణామాల‌ను దృష్టిలో ఉంచుకునే తాజాగా దేశీయ దిగ్గ‌జ బ్యాంకులు ముందుకు వ‌స్తుండ‌డం గ‌మ‌నార్హం.