రేవంత్ కు సీఎం జగన్ ముందస్తు అభినందనలు?

ఆసక్తికర చర్చ ఒకటి తెలంగాణ రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతోంది. మరికొద్ది గంటల్లో తెలంగాణ అసెంబ్లీకి జరిగిన ఎన్నికల ఫలితాలు పూర్తిగా వెలువడనున్న సమయంలోనే.. ఒక అంశాన్ని బలంగా చర్చించుకోవటం కనిపిస్తోంది. తెలంగాణలో జరిగిన ఎన్నికల్లో ఎవరు గెలుస్తారు? అన్న అంశం మీద పలు సంస్థలు తమ ఎగ్జిట్ పోల్స్ వెల్లడించాయి. ప్రముఖులు ఎవరికి వారు తమ వ్యక్తిగత అంచనాల్ని వెల్లడించారు. అంతా బాగుంది.. మరి.. ఏపీ ముఖ్యమంత్రి మాటేంటి?

తెలంగాణలో ఎవరు అధికారంలోకి వస్తారన్న దానిపై బోలెడన్ని లెక్కలు ఉన్న నేపథ్యంలో.. ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి అంచనా ఏమిటి? ఆయన ఏమనుకుంటున్నారు? అన్నది ఆసక్తికరంగా మారింది.విశ్వసనీయ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం.. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఎవరు గెలుస్తారు? ఎవరికిఎన్ని సీట్లు వస్తాయి? అన్న దానిపై ఇప్పటికే సీఎం జగన్ ఒక క్లారిటీకి వచ్చి ఉన్నారని చెబుతున్నారు.

పోలింగ్ పూర్తైన 24 గంటల తర్వాత వివిధ అంశాన్ని పరిగణలోకి తీసుకొని.. లోతైన విశ్లేషణ చేయించి.. అంతిమంగా కాంగ్రెస్ అధికారంలోకి రానుందన్న అంచనాకు వైఎస్ జగన్ వచ్చినట్లుగా చెబుతున్నారు. నిఘా వర్గాలతో పాటు.. కొన్ని సంస్థల చేత ప్రత్యేకంగా ఎన్నికల ఫలితాన్నిమదింపు చేయించిన జగన్.. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి కనిష్ఠంగా 66 సీట్లు తగ్గవని.. గరిష్ఠంగా 72 సీట్ల వరకు రావొచ్చన్న అభిప్రాయానికి వచ్చినట్లుగా తెలుస్తోంది.

అంతేకాదు.. తన చేతికి వచ్చిన రిపోర్టు అనంతరం ఆయన కాబోయే ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డిని పరిగణలోకి తీసుకున్నట్లుగా తెలుస్తోంది. జగన్ ప్రభుత్వంలో కీలకభూమిక పోషించే కొందరి నుంచి అందుతున్న సమాచారం ప్రకారం.. సీఎం జగన్ దూత ఒకరు ఎన్నికల పోలింగ్ పూర్తైన పక్కరోజు ప్రత్యేకంగా భేటీ అయినట్లుగా చెబుతున్నారు. ఏపీ సీఎం సందేశాన్ని రేవంత్ కు తెలియజేయటంతో పాటు.. గెలుపు అవకాశాలకు సంబంధించిన అంచనాను తెలియజేసినట్లుగా తెలుస్తోంది. అంతేకాదు.. ముందస్తుగా అభినందనలు తెలియజేయాలని చెప్పినట్లుగా సమాచారం. దీనికి సానుకూలంగా స్పందించిన రేవంత్.. తన తరఫున ‘థాంక్యూ’ చెప్పాలని కోరినట్లుగా తెలుస్తోంది. అయితే.. ఈ సందర్భంగా వీరిద్దరి మధ్య ఎలాంటి ఫోన్ సంభాషణ లేకపోవటం గమనార్హం.