‘వ‌చ్చే ఎన్నిక‌ల్లో వైసీపీ ఓడిపోతుంది!’

ప‌వ‌న్ క‌ళ్యాణ్ నేతృత్వంలోని జ‌న‌సేన పార్టీకి.. వైసీపీకి చెందిన నాయ‌కులు జై కొట్టారు. ప‌లు జిల్లాల‌కు చెందిన క్షేత్ర‌స్థాయి నాయ‌కులు తాజాగా జ‌న‌సేన పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. మంగ‌ళ‌గిరిలోని పార్టీ కేంద్ర కార్యాల‌యంలో జ‌న‌సేన పార్టీలో వారు చేరారు. ప‌వ‌న్ క‌ళ్యాణ్ వారికి జ‌న‌సేన కండువాలు క‌ప్పి.. సాద‌రంగా ఆహ్వానించారు. జ‌న‌సేన‌లో చేరిన వారిలో కృష్ణాజిల్లా వైసీపీ సర్పంచుల సంఘం అధ్యక్షుడు చిలకలపూడి పాపారావు, తూర్పుగోదావ‌రి జిల్లాకు చెందిన చిక్కాల దొర‌బాబు, ఇదే జిల్లాకు చెందిన దుగ్గ‌ల నాగ‌రాజు, అదేవిధంగా పురుషోత్తం.. ఉన్నారు.

ఇక‌, తూర్పుగోదావరి వైసీపీ నాయకులు, వ‌చ్చే ఎన్నిక‌ల్లో కాకినాడ సిటీ టికెట్‌ను ఆశిస్తున్న ఎదురువాక శ్రీ వెంకటగిరి కూడా జ‌న‌సేనకు జై కొట్టారు. అదేవిధంగా శ్రీకాకుళం జిల్లాకు చెందిన పొగిరి సురేష్‌బాబు, క‌డ‌ప జిల్లాకు చెందిన వై. శ్రీనివాస‌రాజులు.. జ‌న‌సేన‌లో చేరిపోయారు. ఈ సంద‌ర్భంగా వారు మాట్లాడుతూ.. జ‌గ‌న్ పార్టీ పెట్టిన నాటి నుంచి తాము వైసీపీలో ఉన్నామ‌ని.. కానీ.. త‌మ‌కు ఎలాంటి ప్రాధాన్యం లేకుండా పోయింద‌ని.. క్షేత్ర‌స్థాయిలో ల‌క్ష‌ల రూపాయ‌లు ఖ‌ర్చు చేసి.. స్థానిక ఎన్నిక‌ల్లో పార్టీని గెలిపించామ‌ని.. క‌నీసం త‌మ‌ను ప‌ట్టించుకోవ‌డం లేద‌ని విమ‌ర్శ‌లు గుప్పించారు.

వ‌చ్చే ఎన్నిక‌ల్లో వైసీపీ ఓడిపోతుంద‌ని నాయ‌కులు స్ప‌ష్టం చేశారు. క్షేత్ర‌స్థాయిలో వైసీపీ బ‌ల‌హీనంగా ఉంద‌ని.. పైకి మాత్రం అధినేత అంటే.. గౌర‌వంతో కొంద‌రు పార్టీలో కొన‌సాగుతున్నార‌ని.. కానీ, ఎన్నిక‌ల నాటికి అంద‌రూ బ‌య‌ట‌కు వ‌చ్చేస్తార‌ని.. క‌డ‌ప జిల్లాకు చెందిన శ్రీనివాస‌రావు స్ప‌ష్టం చేశారు. కేవ‌లం.. రెడ్డి సామాజిక వ‌ర్గం కోస‌మే పార్టీ పెట్టిన‌ట్టుగా ఉంద‌ని పొగిరి సురేష్‌బాబు వ్యాఖ్యానించారు. ఎవ‌రూ త‌మ ను ప‌ట్టించుకోవ‌డం లేద‌ని.. ఇత‌ర సామాజిక వ‌ర్గాల‌కు వైసీపీలో గౌర‌వం లేద‌ని విమ‌ర్శ‌లు గుప్పించారు.

ఈ సంద‌ర్భంగా ప‌వ‌న్ మాట్లాడుతూ.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో జ‌న‌సేన‌-టీడీపీ ప్ర‌భుత్వం ఏర్ప‌డిన త‌ర్వాత‌.. అన్ని సామాజిక వ‌ర్గాల‌కు మేలు జ‌రిగేలా చ‌ర్య‌లు తీసుకుంటామ‌న్నారు. జ‌న‌సేన‌లో క్షేత్ర‌స్థాయి నాయ‌కుల‌కు కూడా వాల్యూ ఉంద‌ని.. అంద‌రూ చెప్పేది తాను వింటాన‌ని చెప్పారు. పార్టీలో విభేదాలు రాకుండా.. అంద‌రూ క‌లిసిపోయి ప‌నిచేయాల‌ని సూచించారు.