కేసీఆర్ బెటర్ అంటున్న బీజేపీ ఎంపీ.. పరిస్థితి అర్థమైందా?

కేసీఆర్ అంతు చూస్తాం.. ఆయన అరాచకాలను బయటపెడతాం.. అక్రమాలపై విచారణ జరిపి జైల్లో పెడతాం.. ఇవీ ప్రధాని మోదీ సహా బీజేపీ అగ్ర నాయకులు చేస్తున్న ఆరోపణలు. తెలంగాణలో బీఆర్ఎస్ ను ఓడించాలని బీజేపీ పట్టుదలతో సాగుతోంది. అందుకే బీఆర్ఎస్ ప్రభుత్వంపై తీవ్రమైన ఆరోపణలు, విమర్శలు చేస్తోంది. కానీ ఇప్పుడు హఠాత్తుగా ఆ బీజేపీ ఎంపీకి కేసీఆర్ మీద ప్రేమ పుట్టుకొచ్చిందనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. నిజామాబాద్ ఎంపీ, ప్రస్తుతం అసెంబ్లీ ఎన్నికల్లో కోరుట్ల నుంచి పోటీ చేస్తున్న ధర్మపురి అర్వింద్.. కేసీఆర్ పై కీలక వ్యాఖ్యలు చేశారు.

రేవంత్ రెడ్డి కంటే  కేసీఆర్ మేలని ధర్మపురి అర్వింద్ వ్యాఖ్యానించడం గమనార్హం. కేసీఆర్ తెలంగాణ కోసం పదేళ్లు కొట్టాడిండని, అప్పుడు రేవంత్ టీడీపీలో ఉన్నాడని అర్వింద్ అన్నారు. అప్పుడు రేవంత్ తెలంగాణకు వ్యతిరేకంగా పని చేశారని, చంద్రబాబు కోసం సంచులు మోసుకెళ్లాడని అర్వింద్ విమర్శించారు. ఇప్పుడు కూడా చంద్రబాబు చెప్పినట్లే ఆడుతున్నాడని, కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే తెలంగాణను టీడీపీ చేతిలో పెట్టినట్లేనని అర్వింద్ పేర్కొన్నారు. రేవంత్ ను విమర్శించే క్రమంలో కేసీఆర్ ను అర్వింద్ పొగడటం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఇప్పటికే బీజేపీ, బీఆర్ఎస్ ఒకటేననే భావన ప్రజల్లో ఉందనే అభిప్రాయాలున్నాయి. ఇక ఇప్పుడు బీజేపీ ఎంపీ అర్వింద్.. కేసీఆర్ బెటర్ అంటూ చెప్పడం తమ పార్టీకి నష్టం చేసేదనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.

మరోవైపు వాస్తవ పరిస్థితులు అర్థమయ్యాయి కాబట్టే అర్వింద్ ఈ వ్యాఖ్యలు చేశారనే వాదన కూడా లేకపోలేదు. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చే అవకాశముందనే టాక్ ఉంది. బీజేపీకి రెండో స్థానంలో నిలిచే ఛాన్స్ కూడా లేదని టాక్. ఒకవేళ అధికారం కోసం బీజేపీ, బీఆర్ఎస్ కూడా కలిసిపోయే ఆస్కారముందని చెబుతున్నారు. అందుకే ఇప్పుడు బీజేపీ స్టాండ్ మారుస్తుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.