తెలంగాణ సీఎం నేనే.. మోడీ మాటిచ్చారు: ఈట‌ల

తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల నేప‌థ్యంలో ముఖ్య‌మంత్రులు ఎవ‌రు అనే వివాదం ఇప్ప‌టి వ‌ర‌కు కాంగ్రెస్ పార్టీకే ప‌రిమిత‌మైంది. ఈ పార్టీలో లెక్కకు మించిన నాయ‌కులు.. తామంటే తామేన‌ని ముఖ్య‌మంత్రి అభ్య ర్థులుగా అన‌ధికార‌ ప్ర‌చారం చేసుకుంటున్న విష‌యం తెలిసిందే. ఇది రాజ‌కీయంగా కూడా కాంగ్రెస్‌ను ఇబ్బంది పెడుతోంది. “కాంగ్రెస్‌లో ముఖ్య‌మంత్రులు ఉన్నారు. కానీ, ప్ర‌జ‌లు మాత్రం లేరు” అంటూ మంత్రి కేటీఆర్ విమ‌ర్శ‌లు గుప్పించారు.

ఇక‌, ఇప్పుడు ఈ ముఖ్య‌మంత్రుల గోల‌.. మ‌రో జాతీయ పార్టీ బీజేపీలోనూ రాజుకుంది. బండి సంజ‌య్ నుంచి ఒక‌రిద్ద‌రు బీసీ నాయ‌కులు.. తామే ముఖ్య‌మంత్రి అంటూ ప్ర‌చారం చేసుకుంటున్నారు. అయితే.. ఇదంతా కూడా.. తెర‌చాటునే జ‌రుగుతోంది. అయితే.. ఇప్పుడు ఇలాంటి వారిలో సీఎం విష‌యంపై బ‌హిరం గంగా బ్లాస్ట్ అయ్యారు.. మాజీ మంత్రి, ప్ర‌స్తుతం బీజేపీలో ఉన్న ఈట‌ల రాజేంద‌ర్‌. బీజేపీ అధికారంలోకి వ‌స్తే.. తానే ముఖ్య‌మంత్రిన‌ని ఆయ‌న ఓమీడియా సంస్థ‌కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో చెప్పుకొచ్చారు.

అంతేకాదు.. ఈ విష‌యాన్ని ఆయ‌న మ‌రింత బ‌లంగా చెప్పేందుకు ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీ పేరును కూడా వినియోగించారు. ఇటీవ‌ల ఎల్బీ స్టేడియంలో బీజేపీ ఎన్నిక‌ల ప్ర‌చార స‌భ జ‌రిగిన విష‌యం తెలిసిం దే. ఈ స‌భ‌లో ఈట‌ల కూడా పాల్గొన్నారు. స‌భ అనంత‌రం.. ఆయ‌న‌తో మోడీ భేటీ అయ్యార‌ని.. ఈ క్ర‌మంలో 30 మంది బీసీ నాయ‌కుల మ‌ధ్య‌లో రేపు కాబోయే ముఖ్య‌మంత్రివి నువ్వే అంటూ.. మోడీ వ్యాఖ్యానించార‌ని ఈట‌ల చెప్పుకొచ్చారు. ఇంత మంది మ‌ధ్య‌లో ప్ర‌ధాని అంత‌టి వాడు మాటిస్తే.. తాను ముఖ్య‌మంత్రిని కాక మ‌రెవ‌రు అవుతార‌ని ఆయ‌న ప్ర‌శ్నించ‌డం గ‌మ‌నార్హం.

ఇక‌, బండి సంజ‌య్ విష‌యానికి వ‌స్తే.. ఆయ‌న ఎక్క‌డికి వెళ్లినా.. ఏం చేస్తున్నా ఆయ‌న అనుచ‌రులు మాత్రం సీఎం సీఎం అంటూ.. హోరెత్తిస్తున్నారు. ఆయ‌న కాబోయే సీఎం అంటూ ఫ్లెక్సీలు కూడా క‌డుతున్నారు. ఇక‌, ఈ రేంజ్‌లో కాక‌పోయినా.. మ‌రో ఇద్ద‌రు బీసీ నాయ‌కులు కూడా సీఎం పీఠంపై క‌న్నేశారు. మొత్తానికి సీఎంల గోల కాంగ్రెస్ నుంచి బీజేపీకి పాకింద‌నే వాద‌న వినిపిస్తోంది. మ‌రి ఇది బీజేపీకి మేలు చేస్తుందా? కీడు చేస్తుందా? అనేది తెలియాలంటే డిసెంబ‌రు 3వ తేదీ వ‌ర‌కు వెయిట్ చేయాల్సిందే.