‘జగనన్న ఆరోగ్య సురక్ష’తో ఇంటి వద్దకే వైద్యం

సీఎం జగన్ అధికారం చేపట్టిన కొద్ది నెలల్లోనే ఏపీ ప్రభుత్వానికి కరోనా వైరస్ వ్యాప్తి, లాక్ డౌన్ రూపంలో పెను సవాళ్లు ఎదురైన సంగతి తెలిసిందే. అయితే, పాలనకు కొత్త అయినప్పటికీ సీఎం జగన్ కరోనా కట్టడి, లాక్ డౌన్, కరోనా బారిన పడిన వారికి వైద్య సేవలు అందించే విషయంలో అద్భుతంగా పనిచేశారని పలువురు ప్రశంసించారు. ముఖ్యంగా వాలంటీర్ల వ్యవస్థను ఉపయోగించుకొని ప్రతి కుటుంబాన్ని వైద్యపరంగా పర్యవేక్షించడం, ఫివర్ సర్వేలు నిర్వహించడం వంటి కార్యక్రమాలు చేపట్టారు.

జగన్ ఆరోగ్య వ్యవస్థపై ప్రత్యేకంగా దృష్టిసారించారని, అందుకే కరోనా కష్టకాలంలో కూడా ఏపీ ప్రజలు సురక్షితంగా ఉండగలిగారని వైసీపీ నేతలు చెబుతున్నారు. ఈ క్రమంలోనే తాజాగా పేదలు .. వృద్ధులు.. వికలాంగులు .. ఇంట్లో నుంచి బయటకు రానివారికి వైద్య సేవలందించేందుకు ఏపీ ప్రభుత్వం ‘జగనన్న ఆరోగ్య సురక్ష’ అనే సరికొత్త కార్యక్రమానికి ఈ ఏడాది సెప్టెంబరు 30న శ్రీకారం చుట్టింది. ఇంటింటికీ వైద్య సిబ్బందిని పంపించి అక్కడే పరీక్షలు చేసి మందులు ఇచ్చే ఏర్పాటు చేసింది. అవసరమైన వారిని పెద్ద ఆస్పత్రికి తరలించే ఏర్పాట్లు చేస్తున్నారు.

గ్రామ సచివాలయాలతో ప్రజల వద్దకే పాలన అందించిన ఏపీ ప్రభుత్వం…ఇంటి వద్దకే డాక్టర్లు, నర్సులు, వైద్య సిబ్బందిని పంపి వైద్యం అందిస్తున్నారు. సెప్టెంబర్ 30న మొదలైన ఈ కార్యక్రమం రాష్ట్రం నలువైపులా దిగ్విజయంగా సాగుతోంది. మారుమూల పల్లెల్లో సైతం వేల సంఖ్యలో వైద్య శిబిరాలు నిర్వహించి లక్షల సంఖ్యలో చికిత్సలు అందించారు. ఈ కార్యక్రమం ద్వారా దాదాపు 12000 వైద్య శిబిరాలు నిర్వహించి 59. 2 లక్షల మందిని పరీక్షించారు. ఇప్పటిదాకా 1. 44 కోట్ల గృహాలను సందర్శించి 6.4 కోట్ల పరీక్షలు చేశారు. 3. 78 కోట్లమందికి ఆరోగ్య స్క్రీనింగ్ పరీక్షలు చేశారు. గ్రామ, వార్డు సచివాలయాల స్థాయిలో 13,930 శిక్షణ శిబిరాలు నిర్వహించగా 1. 38 కోట్ల కుటుంబాలను వార్డు, గ్రామ వాలంటీర్లు సందర్శించి ప్రజల ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.