ఏపీ అధికారులకు కొత్త తిప్పలు తెస్తున్న జగనన్న రూ.2వేల మాట

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నోటి నుంచి వచ్చిన ఒక మాట వైద్య ఆరోగ్య శాఖ అధికారులకు కొత్త తిప్పలు తెచ్చి పెడుతోంది. కరోనా బాధితుల కోసం ఏర్పాటు చేసిన క్వారంటైన్ సెంటర్లు.. ఆసుపత్రుల వద్ద తరచూ రచ్చ నెలకొంటోంది. దీనికి కారణం ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నోటి నుంచి ఒక మాటేనని చెబుతున్నారు. కరోనా బారిన పడి క్వారంటైన్ సెంటర్లలో ఉండి ఇళ్లకు వెళ్లే వేళలో.. ఖర్చుల కోసం ప్రభుత్వం రూ.2వేల ఇస్తుందని సీఎం పేర్కొన్నారు.

మొదట్లో రూ.2వేల మొత్తాన్ని ఇచ్చినా.. తర్వాత ఆ విషయాల్ని వదిలేశారు. దీనికి సంబంధించిన నిధులు రాకపోవటంతో.. అధికారులు సైతం గమ్ముగా ఉంటున్నారు. ఇంతవరకు బాగానే ఉన్నా.. బాధితులు మాత్రం సీఎం జగనన్న చెప్పిన రూ.2వేలు ఇవ్వరంటూ క్వారంటైన్ సెంటర్ల వద్ద గొడవ పెట్టుకుంటున్నారు. జగనన్న రూ.2వేల ఇవ్వమంటే.. ఇవ్వరా? మీరు తినేశారా? లాంటి ఆగ్రహావేశాల్ని చవిచూడాల్సి వస్తోంది.

రూ.2వేల సాయం గురించి సీఎం జగన్ తో పాటు.. ఏపీకి చెందిన మంత్రులు పలువురు మీడియా ముందు అదే పనిగా చెప్పటంతో సామాన్యుల్లోకి ఈ సమాచారం బాగా వెళ్లింది. దీంతో.. వారు రూ.2వేల కోసం అధికారుల్ని నిలదీస్తున్నారు. ప్రభుత్వం నుంచి తమకు ఆ పేరుతో నిధులు రాలేదని అధికారులు చెబుతున్నా.. బాధితులు మాత్రం వినిపించుకోవటం లేదు.

నిత్యం పలువురి చేత మాట పడాల్సి వస్తోందని వాపోతున్నారు. బాధితులకు ఇస్తానన్న రూ.2వేల విషయాన్ని సీఎం జగన్ గుర్తు చేసుకొని.. అందుకు తగ్గట్లు నిధులు మంజూరు చేస్తే బాగుంటుందని అధికారులు కోరుతున్నారు. వారి గోడును జగన్ ఎంత త్వరగా ఆలకిస్తే.. అంత త్వరగా ప్రజల చీవాట్ల నుంచి బయటపడతామని అధికారులు పేర్కొంటున్నారు.