కేసీఆర్ అంటే.. కాళేశ్వ‌రం క‌రెప్ష‌న్ రావు!

తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల నేప‌థ్యంలో ప్ర‌ధాన పార్టీలైన బీఆర్ ఎస్‌, కాంగ్రెస్‌పార్టీల మ‌ధ్య పోరు ముమ్మరంగా సాగుతోంది. త‌మ‌ల‌పాకుతో నువ్వొక‌టంటే.. త‌లుపుచెక్క‌తో నే రెండంటా! అంటూ.. నాయ‌కు లు మాటల తూటాలు పేల్చుకుంటున్నారు. ఈ క్ర‌మంలో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మాటల దాడిని మ‌రింత పెంచారు. ప్రాజెక్టుల కుంగుబాటు.. అవినీతి అంశాల‌తోపాటు 9 గంట‌ల విద్యుత్ అంశాల‌ను ఆయ‌న ప్ర‌స్తావిస్తున్నారు.

ఈ క్ర‌మంలో తాజాగా “కేసీఆర్ అంటే కాళేశ్వరం కర్రెప్షన్ రావు” అంటూ.. రేవంత్ రెడ్డి ఎద్దేవా చేశారు. కాళేశ్వ‌రం ప్రాజెక్టుకు నాసిరకం పనులతో వేల కోట్ల ప్రజాధనాన్ని వృథా చేశారని అన్నారు. సరైన జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్లే మేడిగడ్డ పిల్లర్లు కుంగిపోయాయన్నారు. పిల్లర్స్ రెండున్నర ఫీట్లు కుంగిపోయిందని అధికారులే స్వయంగా చెబుతున్నారన్నారు. ఇదంతా కేసీఆర్ కుటుంబం చేసిన అవినీతికి తెలంగాణ ప్ర‌జ‌లు మూల్యం చెల్లించుకోవ‌డ‌మేన‌ని నిప్పులు చెరిగారు.

మ‌రోవైపు కాంగ్రెస్ అగ్ర‌నేత కూడా కేసీఆర్ కుటుంబంపై తీవ్ర విమ‌ర్శ‌లు గుప్పించారు. కేసీఆర్ అంటే.. కేరాఫ్ క‌రెప్ష‌న్ అంటూ.. రాహుల్ వ్యాఖ్యానించారు. కేసీఆర్ కుటుంబానికి కాళేశ్వరం ప్రాజెక్టు ఏటీఎంలా మారిందని దుయ్య‌బ‌ట్టారు. కాళేశ్వరం ప్రాజెక్టులో లక్ష కోట్ల అవినీతి జరిగిందని మ‌రోసారి చెప్పుకొచ్చారు.

“కాళేశ్వరం ప్రాజెక్టు పరిస్థితి ప్రత్యక్షంగా చూశా. చాలా దారుణం. తెలంగాణ ప్ర‌జ‌ల సొమ్మును ఎలా తినేశారో.. ఇక్క‌డ ప్ర‌తి పిల్ల‌ర్ చెబుతుంది” అని రాహుల్ అన్నారు. ప్ర‌స్తుత ఎన్నికల్లో బీఆర్ఎస్, బీజేపీ, ఎంఐఎం ఒకటేనని రాహుల్ అన్నారు. ఆ పార్టీలన్నీ బీఆర్ఎస్‌కు అనుకూలంగానే పని చేస్తున్నాయని విమ‌ర్శించారు. దొరల సర్కారును పారదోలి ప్రజల సర్కార్ ను ఏర్పాటు చేయాలని ఆయ‌న ప్ర‌జ‌ల‌కు పిలుపునిచ్చారు. తాజాగా రాహుల్ గాంధీ మేడిగ‌డ్డ ప్రాజెక్టులో కుంగిన ప్రాంతాన్ని ప‌రిశీలించారు.