ఏపీ స‌ర్కారుపై పీకే అంత మాట‌నేశాడేంటి?

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో గ‌త అసెంబ్లీ ఎన్నిక‌ల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి అన్నీ భ‌లేగా క‌లిసి వ‌చ్చాయి. ఆ క‌లిసి వ‌చ్చిన అంశాల్లో ప్ర‌శాంత్ కిశోర్ నేతృత్వంలోని ఐప్యాక్ టీం చేసిన క్యాంపైనింగ్ కూడా చాలా కీల‌క‌మే. ప్ర‌తిప‌క్షాల‌ను టార్గెట్ చేస్తూ ఆ సంస్థ చేసిన కొన్ని కార్య‌క్ర‌మాలు, న‌డిపిన యాంటీ క్యాంపైనింగ్స్ వైసీపీకి బాగా ప్ల‌స్ అయ్యాయి. రాజ‌కీయాల్లో మునుపెన్న‌డూ చూడ‌ని స్థాయిలో కొన్ని దారుణ‌మైన ప్ర‌చారాలు చేయ‌డం, కుల కుంప‌ట్లు రాజేయ‌డంలో కూడా ఐప్యాక్ టీంది కీల‌క పాత్ర‌గా భావిస్తారు రాజ‌కీయ విశ్లేష‌కులు.

ఇందుకోసం పీకే వంద‌ల కోట్లు పుచ్చుకున్నార‌ని ప్ర‌చారంలో ఉన్న సంగ‌తి తెలిసిందే. ఆ బిజినెస్ లెక్క‌ల సంగ‌తి ప‌క్క‌న పెడితే జ‌గ‌న్‌కు ఎప్ప‌ట్నుంచో పీకే మిత్రుడిగా ఉంటున్నాడు. ఈ ఎన్నిక‌ల ముందు కూడా వైసీపీ కోసం పీకే టీం ప‌ని చేస్తున్నట్లే చెబుతున్నారు.

ఇలాంటి నేప‌థ్యంలో జ‌గ‌న్ స‌ర్కారును ఇరుకున పెట్టేలా పీకే ఒక చ‌ర్చా వేదిక‌లో మాట్లాడ‌టం చ‌ర్చ‌నీయాంశంగా మారింది. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో సంక్షేమ ప‌థ‌కాల గురించి పీకే ఈ కార్య‌క్ర‌మంలో మాట్లాడాడు. జ‌నాల‌కు ఉచిత ప‌థ‌కాల రూపంలో డ‌బ్బులు పంచ‌డం బాగానే ఉంటుంద‌ని.. కానీ సంప‌ద సృష్టించి ఇలాంటి కార్య‌క్ర‌మాలు చేయాల‌ని పీకే అన్నాడు.

అత‌నేమీ ఏపీ పేరు ప్ర‌స్తావించ‌కుండా య‌థాలాపంగా ఏమీ ఈ మాట అనలేదు. ప‌ర్టికుల‌ర్‌గా ఏపీ ప్ర‌స్తావ‌న తెచ్చి అక్క‌డ సంప‌ద సృష్టి జ‌ర‌గ‌కుండా సంక్షేమ ప‌థ‌కాల రూపంలో డ‌బ్బులు పంచుతున్నార‌ని.. దీని వ‌ల్ల ఇబ్బందే అని పీకే వ్యాఖ్యానించాడు. ఈ వీడియో ఇప్పుడు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది. జ‌గ‌న్ కోసం ప‌ని చేసే మిత్రుడే ఈ మాట అన్నాడంటే.. జ‌గ‌న్ స‌ర్కారు ఎంత త‌ప్పు చేస్తోందో అర్థం చేసుకోవ‌చ్చ‌నే అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. పీకే ఈ మాట అన్నాడంటే ఐప్యాక్ టీం జ‌గ‌న్ పార్టీ, ప్ర‌భుత్వం కోసం ప‌ని చేస్తోందా లేదా అన్న సందేహాలు కూడా వ్య‌క్త‌మ‌వుతున్నాయి.