చంద్రబాబుకు ఊరట..బెయిల్ పొడిగింపు

అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో టీడీపీ అధినేత చంద్రబాబుకు భారీ ఊరట లభించింది. ఆ కేసులో చంద్రబాబు ముందస్తు బెయిల్ ను ఈ నెల 18 వరకు ఏపీ హైకోర్టు పొడిగించింది. ముందస్తు బెయిల్ పిటిషన్‌పై విచారణను కూడా ఈ నెల 18కి వాయిదా వేసింది. విజయవాడ ఏసీబీ కోర్టులో పీటీ వారెంట్‌పై కూడా ఈ నెల 18 వరకు వరకూ విచారణ జరపవద్దని ఆదేశాలు జారీ చేసింది. ముందస్తు బెయిల్ పిటిషన్‌పై సీఐడీ 500 పేజీల కౌంటర్ దాఖలు చేసింది. దీంతో, తుది వాదనలు వినిపించేందుకు ఈ నెల18 వరకు కోర్టు విచారణ వాయిదా వేసింది.

సోమవారం వరకు చంద్రబాబును అరెస్ట్ చేయవద్దని పోలీసులుకు కొద్ది రోజుల క్రితం హైకోర్టు ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసులో పీటీ వారెంట్, పోలీస్ కస్టడీపై ఎలాంటి ఆదేశాలు ఇవ్వొద్దని ఏసీబీ కోర్టుకు కూడా హైకోర్టు సూచించింది. ఈ క్రమంలోనే ఈ రోజు గడువు ముగియడంతో తాజాగా మరో 2 రోజుల పాటు బెయిల్ పొడిగించింది.

అమరావతి అసైన్డ్ భూముల కేసు విచారణను హైకోర్టు మరోసారి వాయిదా వేసింది. ఈ కేసులో విచారణ ఇప్పటికే పూర్తి కాగా…ఈరోజు తీర్పు వెలువరిస్తామని హైకోర్టు గతంలో పేర్కొంది. అయితే, ఈ కేసులో కొత్త ఆధారాలున్నాయని, వాటిని పరిగణనలోని తీసుకుని విచారణ జరపాలని, కేసును రీ ఓపెన్ చేయాలని సీఐడీ మరో పిటిషన్ దాఖలు చేసింది. కొత్త ఆధారాలను (ఆడియో ఫైల్స్) పరిశీలించిన హైకోర్టు.. తదుపరి విచారణను నవంబర్ 1వకి వాయిదా వేసింది. కేసు రీఓపెన్ పై అభ్యంతరాలు ఉంటే ప్రతివాదులు కౌంటర్ వేయాలని సూచించింది.