ఆంధ్రప్రదేశ్‌లో ఓ సంచలన ఆత్మహత్య

ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టే, ప్రభుత్వ ప్రతిష్ఠను దెబ్బ తీసే పరిణామాలు తరచుగా జరుగుతున్నాయి. తాజాగా చిత్తూరు జిల్లాలో జరిగిన ఓ ఆత్మహత్య వ్యవహారం జగన్ ప్రభుత్వాన్ని ఇరుకున పెడుతోంది. నాలుగు రోజుల కిందట ఏపీ ప్రభుత్వాన్ని చెడామడా తిడుతూ ఒక వీడియోలో కనిపించిన వ్యక్తి.. ఆత్మహత్యకు పాల్పడం సంచలనం రేపుతోంది. ఆ వ్యక్తి పేరు ఓం ప్రతాప్. ఈ వ్యక్తి విషాదాంతం గురించి తెలుగుదేశం యువ నేత నారా లోకేష్ ట్విట్టర్లో వెల్లడించాడు.

చిత్తూరు జిల్లా, పుంగనూరు నియోజకవర్గం, సోమాల మండలం, కందూరు గ్రామానికి చెందిన ఓం ప్రతాప్ కొన్ని రోజుల కిందట జగన్ సర్కారు మద్యం పాలసీపై విరుచుకుపడుతూ ఓ వీడియో పెట్టాడు. అందులో మద్యం బాటిల్ పట్టుకున్న అతను.. ఏపీలో ఊరూ పేరూ లేని బ్రాండ్లను అధిక రేట్లు పెట్టి అమ్ముతున్నారని, దీని వల్ల తాను అప్పుల పాలు కావాల్సి వచ్చిందని అతను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని పరుష పదజాలంతో తిట్టిపోశాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.

ఐతే ఈ వీడియో బయటికి వచ్చిన ఐదు రోజులకే ఓం ప్రతాప్ ఆత్మహత్య చేసుకున్నాడు. సీఎం జగన్‌ను దూషించిన నేపథ్యంలో అతణ్ని చంపేస్తామని వైకాపా నాయకుల బెదిరించారని, పోలీసులు కూడా కేసులు పెడతామని హెచ్చరించారని.. ఈ భయంతోనే ఓం ప్రతాప్ ఆత్మహత్య చేసుకున్నాడని సన్నిహితులు అంటున్నారు. ఈ ఉదంతంపై విచారణ జరిపించాలని నారా లోకేష్ డిమాండ్ చేశారు. ఓం ప్రతాప్ దళితుడని, దళితులకు ప్రభుత్వాన్ని ప్రశ్నించే హక్కు లేదా.. వారిపై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నా అని నారా లోకేష్ అన్నారు.