నిందితుల జాబితాలో ఆప్ ?

ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కీలక పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయా ? జరుగుతున్న పరిణామాలను చూస్తుంటే అందరిలోను ఇదే అనుమానాలు పెరిగిపోతున్నాయి. ఇప్పటికే ఢిల్లీ లిక్కర్ స్కామ్ రాజకీయాల్లో సంచలనం గా మారిన విషయం తెలిసిందే. స్కామ్ లో చేతులుమారిన మొత్తం తక్కువే అయినప్పటికీ ఇందులో ఇన్వాల్వ్ అయిన వ్యక్తుల కారణంగా స్కామ్ సంచలనంగా మారింది. ఇప్పటికే ఢిల్లీ ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రిగా పనిచేసిన, ముఖ్యమంత్రి కేజ్రీవాల్ కు అత్యంత సన్నిహితుడైన మనీష్ సిసోడియా జైలులో ఉన్నారు.

అలాగే మాజీ మంత్రి సత్యేంద్ర జైన్ కూడా జైలులోనే ఉన్నారు. వీళ్ళిద్దరే కాకుండా తాజాగా ఒక ఎంపీ సంజయ్ సింగ్ ను కూడా జైల్లోకి తోశారు. ఇదే కేసులో అరెస్టయిన మరో ఐదుగురు అప్రూవర్లుగా మారిపోయారు. అంటే జరుగుతున్న దాన్ని చూస్తుంటే లిక్కర్ స్కామ్ లో ఈడీ టార్గెట్ మొత్తం ఆప్ మాత్రమే అన్నది అర్ధమైపోతోంది. ఈ నేపధ్యంలోనే స్కామ్ నిందితుల జాబితాలో ఆప్ పార్టీని కూడా చేర్చేందుకు ఈడీ ఆలోచిస్తున్నట్లు సమాచారం.

నిందితుల జాబితాలో ఆప్ ను చేర్చే విషయమై ఈడీ న్యాయ నిపుణుల సలహాలను తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. గతంలో జరిగిన విచారణలో స్కామ్ లో లబ్దిదారుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న పార్టీని నిందితుల జాబితాలో ఎందుకు చేర్చలేదని స్వయంగా అత్యున్నత న్యాయస్ధానమే ఈడీని నిలదీసింది. లిక్కర్ స్కామ్ మొత్తాన్ని గమనిస్తే ఒక రాజకీయపార్టీలోని వాళ్ళకే లబ్ది జరిగినట్లు అర్ధమవుతోందని కోర్టు అభిప్రాయపడింది. అలాంటపుడు ఆ పార్టీని నిందితుల జాబితాలో ఎందుకు చేర్చలేదని ప్రశ్నించింది.

కోర్టే స్వయంగా ప్రశ్నించింది కాబట్టి సమాధానం చెప్పడానికి రెండు రోజుల సమయం కావాలని ఈడీ లాయర్ అడిగారు. సో, జరుగుతున్నది చూస్తుంటే తొందరలోనే లిక్కర్ స్కామ్ నిందితుల జాబితాలో ఆప్ ను కూడా చేర్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇదే జరిగితే కోర్టు ఆదేశాల ఆధారంగా ఆప్ పై ఈడీ కేంద్ర ఎన్నికల కమీషన్ కు ఫిర్యాదు చేసే అవకాశముంది. అప్పుడు ఎన్నికల కమీషన్ ఆప్ గుర్తింపును రద్దు చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు. మరి చివరకు ఏమి జరుగుతుందో చూడాల్సిందే.