పవన్ బీజేపీకి గుడ్ బై చెప్పేసినట్లేనా ?

జనసేన అధినేత పవన్ కల్యాణ్ తాజా ప్రకటన చూసిన తర్వాత అందరికీ ఈ విషయం అర్ధమైపోయింది. కృష్ణా జిల్లాలో మొదలైన నాలుగో విడత వారాహి యాత్రలో పవన్ మాట్లాడుతూ రాబోయే తెలంగాణా ఎన్నికల్లో జనసేన 32 నియోజకవర్గాల్లో పోటీచేస్తుందని ప్రకటించారు. తెలంగాణా ఎన్నికల్లో జనసేన ఒంటరిగానే పోటీ చేస్తుందన్నారు. ఒంటరిగానే జనసేన పోటీ చేస్తుందని పవన్ ప్రకటించటంలో అర్ధమేంటి ? అనే చర్చ పెరిగిపోతోంది. కారణం ఏమిటంటే ఏపీలో బీజేపీతో పొత్తులో ఉన్నారు.

అలాంటిది తెలంగాణాలో కూడా రెండు పార్టీలు కలిసే పోటీ చేస్తాయని అనుకున్నారు. అయితే తెలంగాణాలో బీజేపీ-జనసేన కలిసి పోటీ చేస్తాయని రెండు పార్టీల నుండి ఎప్పుడూ సంకేతాలు కనబడలేదు. అయితే ఏపీలో పొత్తుంది కాబట్టి తెంగాణాలో కూడా ఉంటుందనే ప్రచారం అయితే జరుగుతోంది. అయితే దానికి ముగింపుగా పవన్ తాజా ప్రకటనను బట్టి అర్ధమవుతోంది. ఇదే సమయంలో ఏపీ ఎన్నికల్లో టీడీపీతో కలిసి పోటీచేయబోతున్నట్లు పవన్ ప్రకటించారు. తన మిత్రపక్షం బీజేపీతో మాట్లాడకుండానే పవన్ టీడీపీతో పొత్తును ప్రకటించేశారు.

కాబట్టి ఏపీలో కూడా బీజేపీతో పొత్తుండదనే తాజా పరిణామాలతో అందరు అనుకుంటున్నారు. ఎందుకంటే వారాహి యాత్రలో పవన్ మాట్లాడుతున్నప్పుడు టీడీపీతో పొత్తు గురించే ప్రస్తావిస్తున్నారు కానీ బీజేపీని కలుపుకోవటం లేదు. రాబోయే ఎన్నికల్లో టీడీపీ, జనసేన సంకీర్ణమే అధికారంలోకి వస్తుందని పదేపదే చెబుతున్నారు. పార్టీ సమావేశాల్లో కూడా పొరబాటున కూడా బీజేపీ ప్రస్తావన తేవటంలేదు. చంద్రబాబు నాయుడు అరెస్టు, రిమాండు తర్వాత ఢిల్లీకి వెళ్ళి బీజేపీ పెద్దలను కలిసి ఫిర్యాదు చేస్తానని ప్రకటించారు.

అయితే ఇంతవరకు ఆ దిశగా పవన్ ప్రయత్నాలు చేయటం లేదు. చంద్రబాబు జైలుకు వెళ్ళి ఇప్పటికి 24 రోజులు అయినా పవన్ ఇంతవరకు ఢిల్లీ బాట పట్టలేదు. పార్టీ వర్గాల సమాచారం ప్రకారం చంద్రబాబు అరెస్టు వెనుక బీజేపీ పెద్దల హస్తముందనే సమాచారం పవన్ కు ఉందట. చంద్రబాబు అరెస్టుతో బీజేపీకి సంబంధంలేదని మీడియాతో చెప్పినా పవన్ అయితే అంతర్గతంగా కమలనాదుల హస్తం ఉందనే నమ్ముతున్నారట. అందుకనే ఢిల్లీకి వెళ్ళినా ఎలాంటి ఉపయోగం ఉండదని అర్ధమైపోయిందట. ఇవన్నీ సమీక్షించుకున్న తర్వాతే బీజేపీకి గుడ్ బై చెప్పాలని పవన్ అనుకున్నట్లు సంకేతాలు కనబడతున్నాయి.