స‌భ్య‌త్వం సౌండ్ లేదు సైనికా

ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వంలో కీల‌క రోల్ పోషిస్తున్న జ‌న‌సేన పార్టీ.. ఈ ఏడాది పార్టీ స‌భ్య‌త్వాన్ని గత నెల‌లోనే ప్రారంభించిన విష‌యం తెలిసిందే. ఈ స‌భ్య‌త్వ కార్య‌క్ర‌మానికి `ఉద్య‌మి` అనే పేరును పెట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ త‌ర‌ఫున నాయ‌కులు.. కార్య‌క‌ర్త‌లు ఉద్య‌మి స‌భ్య‌త్వ కార్య‌క్ర‌మాన్ని జోరుగా ముందుకు తీసుకువెళ్లాల‌ని స‌భ్య‌త్వ కార్య‌క్ర‌మం ప్రారంభం రోజునే పార్టీ అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ తేల్చి చెప్పారు. దీనిని అప్ప‌ట్లో నాయ‌కులు కూడా ఉత్సాహంగా ముందుకు తీసుకువెళ్తామ‌ని ప్ర‌క‌టించారు. ఇక‌, ఈ ద‌ఫా స‌భ్య‌త్వాల‌కు పెద్ద‌గా ల‌క్ష్యాల‌ను నిర్దేశించ‌క‌పోవ‌డం గ‌మ‌నార్హం.

గ‌తంలో..

ఏదైనా స‌రే..ల‌క్ష్యం ఉంటేనే ఆదిశ‌గా నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు ముందుకు సాగేందుకు అవ‌కాశం ఉంటుంది. గ‌త ఏడాది నిర్వ‌హించిన స‌భ్య‌త్వ న‌మోదుకు మండ‌లాలు, న‌గ‌రాల వారీగా జ‌న‌సేనాని కొన్ని ల‌క్ష్యాలు పెట్టారు. స‌భ్య‌త్వ రుసుమును రూ.500గా నిర్ణ‌యించినా.. కొన్ని ల‌క్ష్యాలు పెట్ట‌డంతో నాయ‌కులు ముందుకు సాగారు. ఇంటింటికీ తిరిగి స‌భ్య‌త్వాలు న‌మోదు చేయించారు. కొన్ని కొన్ని ప్రాంతాల్లో ఆఫీసులు, ప్రైవేటు ప‌రిశ్ర‌మ‌ల‌ను కూడా సంద‌ర్శించి.. అక్క‌డ కార్మికులతో స‌భ్య‌త్వం రాయించారు. మొత్తంగా గ‌తంలో జ‌రిగిన స‌భ్య‌త్వం జోరుగా ముందుకు సాగింది.

ప్ర‌స్తుతం..

ప్ర‌స్తుతం `ఉద్య‌మి` పేరుతో నిర్వ‌హిస్తున్న స‌భ్య‌త్వ న‌మోదు పెద్ద‌గా ముందుకు సాగ‌డం లేద‌న్న వాద‌న బ‌లంగా వినిపిస్తోంది. నాయ‌కులు సీరియ‌స్‌గా తీసుకోక‌పోవ‌డం.. ఎవ‌రికి వారు సొంత ప‌నుల్లో నిమ‌గ్నం అయ్యార‌న్న ప‌రిస్థితి క‌నిపిస్తుండ‌డంతో స‌భ్య‌త్వంపై పెద్ద‌గా ఎవ‌రూ ప‌ట్టించుకోవ‌డం లేదు.

ఏదో నాలుగు రోడ్ల కూడ‌ళ్ల‌లో ఓ  బ‌ల్ల ప‌రుచుకుని.. ఓ చిన్న‌పాటి బ్యాన‌ర్ క‌ట్టుకుని క‌నిపిస్తున్నారే.. త‌ప్ప చొర‌వ తీసుకుని ప్ర‌జ‌ల‌ను క‌లుసుకోవ‌డం.. స‌భ్య‌త్వం రాయించ‌డం పార్టీ విధానాలు వివ‌రించ‌డం వంటివి చేయ‌డం లేదు. దీంతో ఉద్య‌మి స‌భ్య‌త్వం.. నిశ్శ‌బ్దంగా మారిపోతోందా? అనే చ‌ర్చ జ‌రుగుతోంది.

సిద్ధాంతాల‌పై ప‌ట్టు?

జ‌న‌సేన పార్టీ సిద్ధాంతాల గురించి ప‌వ‌న్ ప‌దే ప‌దే చెబుతున్న విష‌యం తెలిసిందే. అయితే.. ఈ సిద్ధాంతాల‌పై క్షేత్ర‌స్థాయిలో నాయ‌కులకు ప‌ట్టు క‌నిపించ‌డం లేదు. ఈ ప‌రిణామం.. కూడా పార్టీలో ఇబ్బందులు సృష్టిస్తోంది. నాయ‌కుల‌కే సిద్ధాంతాల‌పై ప‌ట్టు క‌నిపించ‌క‌పోవ‌డంతో క్షేత్ర‌స్థాయిలో కార్య‌క‌ర్త‌ల ప‌రిస్థితి ఏంట‌న్న‌ది ప్ర‌శ్న‌.

వాస్త‌వానికి విజ‌య‌వాడ‌, గుంటూరు, విశాఖ‌, రాజ‌మండ్రి, ఏలూరు,తాడేప‌ల్లి గూడెం, ఉత్త‌రాంధ్ర‌లోని శ్రీకాకుళం వంటి ప్రాంతాల్లో జోరుగా స‌భ్య‌త్వానికి అవ‌కాశం ఉన్నా.. నాయ‌కులు ప‌ట్టించుకోక‌పోవ‌డంతో న‌త్త‌న‌డ‌క‌న సాగుతోంది. అయితే.. నిన్న మొన్న‌టి వ‌ర‌కు అసెంబ్లీ స‌మావేశాలు ఉండ‌డం కూడా ఈ కార్య‌క్ర‌మాల ప‌ర్య‌వేక్ష‌ణ‌పై ప్ర‌భావం ప‌డుతోంద‌న్న చ‌ర్చ ఉంది.