రిపోర్టులో లోకేష్ పేరు..పీక కోసుకుంటానన్న అచ్చెన్న

స్కిల్ డెవలప్ మెంట్ స్కామ్ లో టీడీపీ అధినేత చంద్రబాబుపై రిమాండ్ రిపోర్టును విజయవాడలోని ఏసీబీ కోర్టులో సీఐడీ అధికారులు సమర్పించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే చంద్రబాబును 15 రోజుల జ్యుడిషియల్ కస్టడీకి ఇవ్వాలని న్యాయమూర్తిని సీఐడీ అధికారులు కోరారు. అంతేకాదు, ఆ రిమాండ్ రిపోర్టులో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్, ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడుల పేర్లను కూడా సీఐడీ అధికారులు చేర్చడం సంచలనం రేపింది.

చంద్రబాబు సన్నిహితుడు కిలారు రాజేశ్ ద్వారా లోకేష్ కు కోట్ల రూపాయలు అందాయని రిమాండ్ రిపోర్టులో సీఐడీ సంచలన ఆరోపణలు చేసింది. ఈ నేపథ్యంలోనే జగన్ కు అచ్చెన్నాయుడు సవాల్ విసిరారు. చంద్రబాబుపై, తనపై ఆరోపణలు నిరూపిస్తే తన పీక కోసుకుంటానని అచ్చెన్న ఛాలెంజ్ చేశారు. అంతేకాదు, అదే జరిగితే తాను రాజకీయ సన్యాసం తీసుకుంటానని సంచలన ప్రకటన చేశారు. ఆ స్కాం కేసులో చంద్రబాబును ఇరికించి వేధిస్తున్నారని అచ్చెన్న ఆరోపించారు.

చంద్రబాబు ఉగ్రవాది కాదని, పారిపోలేదని, ఏపీలో రాజకీయ కక్స తప్ప.. చట్టం,ధర్మం లేదని అచ్చెన్న ఆరోపించారు. ఏపీలో పిచ్చి పరాకాష్టకు చేరిందని, చంద్రబాబు అరెస్టు ప్రజాస్వామ్యానికి చీకటి రోజు అని అన్నారు. రాజకీయ కక్షతోనే ప్రతిపక్ష పార్టీలను జగన్ ఇబ్బంది పెడుతున్నారని మండిపడ్డారు. విపక్ష నేతలను జైలులో పెట్టి జగన్ రాక్షసానందం పొందుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు..సీఐడీ అధికారులకు సిగ్గులేదని, జగన్ ఏ నాటకం ఆడమంటే ఆ నాటకం ఆడుతున్నారని విమర్శించారు. మరోవైపు, అచ్చెన్నాయుడుతోపాటు టీడీపీ నేతలకు గవర్నర్ అపాయింట్ మెంట్ రద్దు చేశారు. కోర్టులో విచారణ జరుగుతున్నందున ఈ అపాయింట్ మెంట్ రద్దయింది.