ఏపీలో అక్రమ మద్యం.. మహిళా వాలంటీర్ అరెస్టు

ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం వాలంటీర్ల వ్యవస్థపై తీవ్ర చర్చ సాగుతున్న సంగతి తెలిసిందే. ఈ వాలంటీర్ల ద్వారా ప్రజల వ్యక్తిగత సమాచారాన్ని సేకరించి వైసీపీ ప్రభుత్వం దుర్వినియోగం చేస్తుందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. అంతే కాకుండా వాలంటీర్ల ముసుగులో కొంతమంది అన్యాయం, అక్రమాలకు తెరలేపారనే విమర్శలు వినిపిస్తున్నాయి. జనసేన అధినేత పవన్ కల్యాణ్ అయితే వాలంటీర్ల వ్యవస్థపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇద్దరు వాలంటీర్లు ఏపీకి అక్రమంగా మద్యం తరలించి, అమ్ముకుంటూ పోలీసులకు పట్టుబడటం కలకలం రేపుతోంది.

తాజాగా అన్నమయ్య జిల్లా కురవకోట మండలం అంగళ్లుకు చెందిన ఇద్దరు వాలంటీర్లు కర్ణాటక మద్యాన్ని అక్రమంగా ఏపీలో విక్రయిస్తూ పోలీసులకు పట్టుబడ్డారు. వీళ్లలో ఓ మహిళా వాలంటీర్ కూడా ఉన్నారు. అక్రమంగా కర్ణాటక మద్యం విక్రయించడంతో పాటు రవాణా చేస్తున్నారనే సమాచారంతో అంగళ్లు గ్రామ పంచాయతీ పాత ట్యాంకు వీధిలో మదనపల్లె స్పెషల్ ఎన్ఫోర్స్ మెంట్ బ్యూరో తనిఖీలు నిర్వహించింది. ఈ దాడుల్లో అంగళ్లు క్లస్టర్ 19 వాలంటీర్ దాసరి సందీప్ కుమార్తో పాటు మహిళా వాలంటీర్ లేపాక్షి అమ్మాజీలు కర్ణాటక మద్యం అమ్ముతున్నట్లు సెబ్ అధికారులు గుర్తించారు. వీళ్లకు సహకరిస్తున్న కర్ణాటకలోని రాయలపాడుకు చెందిన నడిపిరెడ్డితో పాటు ఈ ఇద్దరు వాలంటీర్లను పోలీసులు అరెస్టు చేసి కేసు నమోదు చేశారు. వీళ్లను కోర్టులో ప్రవేశపెట్టగా 14 రోజుల రిమాండ్ విధించింది.

ఇప్పటికే వాలంటీర్ల వ్యవస్థపై ప్రతిపక్షాలు తీవ్ర ఆరోపణలు, విమర్శలు చేస్తున్నాయి. అంతే కాకుండా ప్రజల ఫించను డబ్బులతో వాలంటీర్ పరారీ, అధికార దుర్వినియోగం తదితర వార్తలు వస్తూనే ఉన్నాయి. మరోవైపు వాలంటీర్ల ద్వారా ప్రజల వ్యక్తిగత, సున్నితమైన సమాచారాన్ని వైసీపీ ప్రభుత్వం సేకరిస్తుందని జనసేన అధినేత పవన్ చేసిన వ్యాఖ్యలు కలకలం రేపిన సంగతి తెలిసిందే. వైసీపీ కార్యకర్తల్లా వాలంటీర్లు మారిపోయారని, ఎన్నికల సంఘం నిబంధనలకు విరుద్ధంగా ఆ పార్టీ కోసం ప్రచారం చేస్తున్నారని టీడీపీ అధినేత చంద్రబాబు కూడా విమర్శిస్తున్న విషయం విదితమే. ఇప్పుడేమో ఇలా వేరే రాష్ట్రం నుంచి అక్రమంగా మద్యం తరలించి, ఏపీలో అమ్ముతూ వాలంటీర్లు పట్టుబడటం మరింత చర్చనీయాంశంగా మారింది.