రాజాసింగ్కు పోటీగా బీజేపీలోనే మాజీ మంత్రి తనయుడు

రాబోయే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ మరోసారి పోటీ చేస్తారా? ఆయనపై బీజేపీ అధిష్ఠానం విధించిన సస్పెన్షన్ తొలిగిపోతుందా? అనే ప్రశ్నలు ఓ వైపు ఉండగానే.. మరోవైపు రాజాసింగ్కు సొంత పార్టీ నుంచే పోటీ కనిపిస్తోంది. వచ్చే ఎన్నికల్లో గోషామహల్ టికెట్ కోసం మాజీ మంత్రి ముఖేశ్ గౌడ్ తనయుడు, బీజేపీ నేత విక్రమ్ గౌడ్ దరఖాస్తు చేసుకోవడమే అందుకు కారణం. దీంతో గోషామహల్ నియోజకవర్గం మరోసారి చర్చనీయాంశంగా మారింది.

గోషామహల్ గా 2008లో మారిన ఈ నియోజకవర్గంలో 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి దివంగత ముఖేశ్ గౌడ్ ఎమ్మెల్యేగా గెలిచారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత వరుసగా రెండు ఎన్నికల్లోనూ ఇక్కడ రాజా సింగ్ దే ఆధిపత్యం కొనసాగింది. 2018 ఎన్నికల్లో అయితే బీజేపీ నుంచి గెలిచిన ఏకైక ఎమ్మెల్యే ఆయనే. కానీ పార్టీ నిబంధనలకు విరుద్ధంగా అనుచిత వ్యాఖ్యలు చేశారనే కారణంతో రాజా సింగ్ పై బీజేపీ సస్పెన్షన్ విధించిన సంగతి తెలిసిందే. దీంతో వచ్చే ఎన్నికల్లో ఆయన పోటీ చేయడంపై సందేహాలు వ్యక్తమయ్యాయి. తెలంగాణ అసెంబ్లీలో రాజా సింగ్ మాట్లాడుతూ.. మళ్లీ సభకు వస్తానో లేదోననే ఆవేదన వ్యక్తం చేశారు.

ఇలాంటి పరిస్థితుల్లో గోషామహల్లో పట్టు కోసం విక్రమ్ గౌడ్ పావులు కదుపుతున్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇక్కడ బీజేపీకి బలం ఉంది కాబట్టి వచ్చే ఎన్నికల్లో విజయం సాధించాలనే లక్ష్యంతో విక్రమ్ సాగుతున్నారని చెబుతున్నారు. కానీ రాజా సింగ్ సస్పెన్షన్ విషయంపై అధిష్ఠానం సానుకూలంగా ఉందని, త్వరలోనే నిర్ణయం తీసుకోనుందని ఇటీవల బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్ రెడ్డి వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. దీంతో రాజా సింగ్ పై సస్పెన్షన్ తొలిగిపోతుందనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అదే జరిగితే రాజా సింగ్ పోటీకి సిద్ధమయ్యే అవకాశాలుంటాయి. మరి అప్పుడు విక్రమ్ పరిస్థితి ఏమిటన్నది చూడాలి.