పవన్ కు ఆరోగ్య శ్రీ పథకం

విశాఖ గాజువాక లో జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ చేసిన వ్యాఖ్యలకు వైసీపీ మంత్రి రోజా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆమె సోమవారం విలేకరులతో మాట్లాడుతూ.. పవన్ మాట్లాడిన మాటలు వింటుంటే జగన్‌ పై ఎంత కడుపు మంటో అర్థం అవుతుందంటూ పేర్కొన్నారు. తన కంటే చిన్నవాడు రాజకీయాల పరంగా, ప్రజల్లో అభిమానం పెరుగుతుంటే చూసి ఓర్వలేకపోతున్నారంటూ చురకలు అంటించారు.

ప్రజల్లో ఉన్న ఒక నాయకుడు భూమి పేలిపోవాలి.. అందులోకి రుషికొండ వెళ్లాలి.. అందులో జగన్‌ సమాధి కావాలని ఎంత దారుణంగా మాట్లాడారు. ఆయన అలా అరిచి అరిచి గుండె పగిలి చచ్చిపోతాడేమో అని భయమేస్తోందన్నారు. పవన్‌ కు ఆరోగ్య శ్రీ పథకం ద్వారా చికిత్స అందించాలని జగన్ ను కోరుతున్నామని తెలిపారు.

అయినా కూడా ఆయన కడుపు మంట చల్లారకపోతే.. హైదరాబాద్ లోని ఎర్రగడ్డ ఆసుపత్రిలో చికిత్స ఇప్పిస్తామన్నారు. కేవలం అమరావతి బినామీల భూములు రేట్లు పడిపోతాయనే భయంతో రుషికొండ పై ఆయన విషయం చిమ్ముతున్నారని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. పవన్ కల్యాణ్ భవిష్యత్తులోనూ కనీసం ఎమ్మెల్యే కూడా కాలేరన్నారు. ఇప్పటికైనా షూటింగ్ చేసుకుంటే కనీసం డబ్బులైనా వస్తాయని, కానీ ఇలా ఎండల్లో తిరిగి పిచ్చి మాటలు మాట్లాడితే ప్రజలతో రాళ్ల దెబ్బలు తప్పవని హెచ్చరించారు.

జగన్ వెళ్లడానికి సొంత నియోజకవర్గం పులివెందుల ఉందని, కానీ జనసేనానికి ఏముందని ప్రశ్నించారు. వారికి సొంత నియోజకవర్గం లేదని, వారి నియోజకవర్గంలోనే కుటుంబాన్నే ఓడించారన్నారు. అసలు ఏపీలో సొంత ఇల్లు కూడా లేదన్నారు. టీడీపీ పై కూడా రోజా ఆగ్రహం వ్యక్తం చేశారు. టిడ్కో ఇళ్ల ముందు ఏ మొహంతో వారు సెల్ఫీలు దిగారని ప్రశ్నించారు. వారిది సెల్ఫీ ఛాలెంజ్ కాదని, టీడీపీ సెల్ఫ్ గోల్ అన్నారు. టిడ్కో ఇళ్ల నుండి డబ్బులు వసూలు చేశారన్నారు.