హైద‌రాబాద్‌లో ఏ కులం.. భూముల ధ‌ర‌లు పెంచింది?

యువ‌గ‌ళం పాద‌యాత్ర చేస్తున్న టీడీపీ యువ నాయ‌కుడు, మాజీ మంత్రి నారా లోకేష్‌.. సీఎం జ‌గ‌న్‌పైనా.. వైసీపీ నాయ‌కుల పైనా విమ‌ర్శ‌లు గుప్పించారు. రాజ‌ధాని అమ‌రావ‌తి ప్రాంతంలో సాగుతున్న యువ‌గ‌ళం పాద‌యాత్ర సంద‌ర్భంగా ఆదివారం సాయంత్రం .. ఇక్క‌డి రైతులు, ప్ర‌జాప్ర‌తినిధుల‌తో నారా లోకేష్ భేటీ అయ్యారు.

ఈ సంద‌ర్భంగా ఆయ‌న అమ‌రావ‌తి రాజ‌ధానిపై వైసీపీ నాయ‌కులు, సీఎం జ‌గ‌న్ చేసిన గ‌త వ్యాఖ్య‌ల‌ను గుర్తు చేశారు. “రాజ‌ధాని అమ‌రావ‌తిలో ఒక సామాజిక వ‌ర్గం మాత్ర‌మే పాగా వేయాల‌ని భావించింది. అందుకే ధ‌ర‌లు పెరిగిపోయాయి” అని సీఎం జ‌గ‌న్ అన్నార‌ని నారా లోకేష్ చెప్పారు.

అయితే.. తెలంగాణ రాజ‌ధాని హైద‌రాబాద్‌లో ఉన్న ప‌లు ప్రాంతాల్లో ప్ర‌భుత్వం భూములు వేలం వేస్తోంద‌ని.. కోకా పేట‌లోల ఎక‌రం 100 కోట్లు ప‌లికింద‌ని.. మ‌రి దీని వెనుక ఏకులం ఉంద‌ని.. ఏ కులం ఆధారంగా 100 కోట్ల ధ‌ర ప‌లికింద‌ని నారా లోకేష్ ప్ర‌శ్నించారు. దీనికి స‌మాధానం చెప్పాల‌ని ఆయ‌న వైసీపీ నాయ‌కుల‌కు స‌వాల్ రువ్వారు. ఇక‌, రాష్ట్రానికి చంద్ర‌బాబు హ‌యాంలో వ‌చ్చిన ఫ్యాక్స్ కాన్ కంపెనీని వైసీపీ నాయ‌కులు త‌రిమేశార‌ని.. ఇప్పుడు అది క‌ర్ణాట‌క‌కు పోయింద‌ని.. దీనికి ఏ మతం తీసుకువెళ్లింద‌ని ప్ర‌శ్నించారు.

ఏపీలో క‌ష్ట‌ప‌డి గ‌త ప్ర‌భుత్వం.. సీఎం చంద్ర‌బాబు తీసుకువ‌చ్చిన పరిశ్రమలు కూడా పక్క రాష్ట్రాలకు తరలిపోతున్నాయ‌న్నారు.  కులం, మతం, ప్రాంతం పేరుతో ప్రజల మధ్య జగన్‌ చిచ్చు పెడుతున్నారని లోకేష్ దుయ్య‌బ‌ట్టారు. తల్లిని, చెల్లిని మోసం చేసిన వ్యక్తి.. మిగతవారికి న్యాయం చేస్తారా?  అని ప్ర‌శ్నించారు.