జగన్ కు సారీ చెప్పిన పిల్లి సుభాష్

రామచంద్రాపురం వైసీపీలో రాజుకున్న రాజకీయ చిచ్చు ఆ పార్టీ అధిష్టానాన్ని కలవరపెడుతోన్న సంగతి తెలిసిందే. మంత్రి వేణుగోపాల్ వర్సెస్ ఎంపీ పిల్లి సుభాష్ ల కోల్డ్ వార్ ఎపిసోడ్ కు ది ఎండ్ కార్డ్ వేసేందుకు తూర్పుగోదావరి వైసీపీ ఇన్ చార్జ్ మంత్రి, ఎంపీ మిథున్ రెడ్డి చేసిన మధ్యవర్తిత్వం దాదాపుగా ఫలించినట్లు కనిపిస్తోంది. ఈ క్రమంలోనే తాను పార్టీ మారబోతున్నాను అంటూ జరుగుతున్న ప్రచారంపై తాజాగా పిల్లి సుభాష్ స్పందించారు. తాను జనసేనలో చేరబోతున్నాను అన్న ప్రచారంలో వాస్తవం లేదని ఆయన క్లారిటీనిచ్చారు.

వైసీపీ నిర్మాణంలో తాను పిల్లర్‌ వంటి వాడినని, తాను వైసీపీని వీడే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. అయితే, ఎంపీ పదవికి రాజీనామా చేసి, ఇండిపెండెంట్‌గా పోటీ చేస్తానని చేసిన కామెంట్లకు గాను సీఎం జగన్‌కి క్షమాపణలు చెప్తున్నానని సంచలన వ్యాఖ్యలు చేశారు. అలా మాట్లాడకుండా ఉండాల్సిందని, క్యాడర్ నిరాశానిస్పృహలు చూసి అలా మాట్లాడాల్సి వచ్చిందని వివరణనిచ్చే ప్రయత్నం చేశారు. రామచంద్రపురం టికెట్ ఎవరిది అన్న విషయంపై కూడా క్లారిటీనిచ్చారు. సీఎం పర్సనల్ టీం సర్వే చేసి ఇచ్చే నివేదిక, బలాబలాల ఆధారంగా తదుపరి నిర్ణయాలుంటాయని చెప్పారు. ఆ ప్రతిపాదనకు తాను అంగీకరించానని వెల్లడించారు.

అయితే, కార్యకర్తల మీద క్రిమినల్ కేసులు పెడుతున్న ఆధారాలను సీఎంకు ఇచ్చామని, జరుగుతున్న విషయాలను నిర్మొహమాటంగా పార్టీ పెద్దల దృష్టికి తీసుకువెళ్లానని అన్నారు. కార్యకర్తల ఇబ్బంది చూసి అలా వ్యాఖ్యానించానని, పార్టీ పెద్దలు సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటారని ఆశాభావం వ్యక్తం చేశారు. మంత్రి వేణు తన పని తాను చేసుకుంటాడని, తన పని తాను చేసుకుంటానని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.