బండి పదవికి గండి పడనుందా

కేంద్ర మంత్రి బండి సంజయ్ కు సన్ స్ట్రోక్ తప్పేలా లేదు. బండిని మంత్రి పదవి నుంచి తొలగించడం ఖాయమని ఢిల్లీ మీడియా కోడై కూస్తుంది. ఈ నెల 15 వ తేదీన మంత్రి వర్గ విస్తరణ జరుగుతుందని ఢిల్లో పొలిటికల్ సర్కిల్ లో జోరుగా ప్రచారం కొనసాగుతుంది. కేంద్ర మంత్రులందరూ అందుబాటులో వుండాలని మంగళవారం పిలుపు రావడంతో బండి సంజయ్ హుటాహుటిన ఫ్లయిట్ ఎక్కి ఢిల్లీ చేరుకున్నారు. రెండు మూడు రోజులు అక్కడే ఉంటారని సన్నిహితులు చెబుతున్నారు.

ఇప్పటికే బండి సంజయ్ ని రాజీనామా చేయమని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా ఆదేశించినట్లు ప్రచారం జరుగుతుంది. బండి కుమారుడి వ్యవహారంలో తెలంగాణాలో పార్టీకి డ్యామేజ్ జరిగిందని, కనుక పదవి నుంచి తప్పుకోవాలని సూచించినట్లు తెలుస్తుంది. బండి మాత్రం రాజీనామా చేయకుండా మొండికేస్తున్నట్లు కథనాలు వస్తున్నాయి . ఇప్పటికే ఒక నిర్ణయం తీసుకున్న మోదీ టీం మాట వింటే సరే సరి లేకపోతే నిర్మొహమాటం లేకుండా పదవి నుంచి తప్పిస్తామని సంకేతం ఇచ్చినట్లు సమాచారం.

2021 జులై 7 వ తేదీన బండి సంజయ్ కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి పదవిని చేపట్టారు. ఇటీవల కుమారుడు భగీరథ్ మీద పోక్సో కేసు నమోదు కావడం సంచలనం సృష్టించింది. సాక్షాత్తు కేంద్ర హోం మంత్రి కుమారుడు పోక్సో కేసులో జైలుకు వెళ్లి రావడం ప్రభుత్వానికి తద్వారా పార్టీకి చెడ్డపేరు వచ్చిందని ప్రధాని మోదీ భావిస్తున్నట్లు సమాచారం. ఈ ఘటన తర్వాత కూడా ఆయనను పదవిలో కొనసాగిస్తున్నారు. జెన్ జీ క్రియాశీలంగా వ్యవహారిస్తున్న నేపథ్యంలో ఈ వ్యవహారం ప్రభుత్వానికి తలనొప్పిగా మారే అవకాశం ఉన్నందున బండి మీద వేటు వేయాలన్న నిర్ణయానికి వచ్చినట్లు కేంద్ర వర్గాలు చెబుతున్నాయి.

భగీరథ్ యవ్వారమే కాకుండా అవసరమైతే కొత్త రాజకీయ పార్టీ పెడతానంటూ బండి సంజయ్ చెప్పినట్లు వచ్చిన వార్తలను కూడా అధిష్టానం సీరియస్ గా తీసుకున్నట్లు తెలుస్తుంది. కొత్త పార్టీ విషయాన్ని బండి ఖండించడమే కాకుండా చనిపోయాక తన మృతదేహం మీద బీజేపీ జెండా కప్పాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. అయినప్పటికీ అధిష్టానం క్షమించినట్లు లేదని విశ్లేషకులు చెబుతున్నారు.