కేసీయార్ ను ఈ జిల్లా బాగా వేధిస్తోందా ?

ప్రత్యేక తెలంగాణ ఉద్యమం ఎంత ఉవ్వెత్తున లేచినా, రెండుసార్లు వరుసగా అధికారంలోకి వచ్చినా ఒక జిల్లా మాత్రం కేసీయార్ కు మింగుడు పడటం లేదు. ఇంతకీ ఆ జిల్లా ఏమిటో తెలుసా ఖమ్మం. ఉద్యమంలో కానీ తర్వాత కానీ ప్రత్యేక తెలంగాణా వాదంతో ఖమ్మం జిల్లా తనకేమీ పట్టనట్లే ఉండిపోయింది. తెలంగాణలోని అన్నీ జిల్లాల్లో ఎంతోకొంత బీఆర్ఎస్ పట్టు సాధించినా ఖమ్మంలో మాత్రం ఎందుకు పనికిరాకుండా పోతోంది. జిల్లాలోని పదిసీట్లలో మహాయితే ఒకటి లేదా అతికష్టంమీద రెండు సీట్లకు మాత్రమే పరిమితమవుతోంది.

ఇపుడున్న పది నియోజకవర్గాల్లో ఖమ్మంలో మాత్రమే బీఆర్ఎస్ సొంతంగా గెలుచుకుంది. మిగిలిన నాలుగైదుగురు ఎంఎల్ఏలను ప్రలోభాలకు గురిచేసి తెచ్చుకున్నదే. రాబోయే ఎన్నికల్లో పార్టీ పరిస్ధితిపై కేసీయార్ రెగ్యులర్ గా సర్వేలు చేయించుకుంటునే ఉన్నారు. ఈ సర్వేల్లో కూడా పార్టీ పరిస్ధితి ఏమంత ఆశాజనకంగా లేదని రిపోర్టు వచ్చిందట. ఎలాగైనా సొంతంగానే మెజారిటి ఎంఎల్ఏలను గెలవాలన్నది కేసీయార్ కోరిక.

అయితే వచ్చేఎన్నికల్లో కూడా ఆ కోరిక తీరేట్లుగా కనబడటం లేదు. అందుకనే ఏమిచేయాలనే విషయంలో జిల్లాలోని ఎంఎల్ఏలు, ఎంపీ, సీనియర్ నేతలతో కేసీయార్ వరుసగా రెండురోజులు సమావేశమయ్యారు. అయినా పెద్ద ఉపయోగం కనబడలేదు. ఎందుకంటే జిల్లాలో కాంగ్రెస్ నేతల ఊపు బాగా కనబడుతోంది. సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పాదయాత్ర ప్రభావం, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి చేరికతో కాంగ్రెస్ బాగా బలోపేతమైందని అనుకుంటున్నారు.

మరిపుడు వీళ్ళకు ధీటుగా వ్యూహాలు, ప్రతివ్యూహాలు పన్ని అత్యధిక సీట్లు సాధించటం ఎలాగన్న విషయమే కేసీయార్ ను బాగా వేధిస్తోంది. ఖమ్మంలో మంత్రి పువ్వాడ అజయ్ గెలుపు కూడా అనుమానమన్నట్లుగానే తయారైంది. మంత్రే గెలవకపోతే ఇక మిగిలిన వాళ్ళ పరిస్ధితి ఏమిటో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్-కాంగ్రెస్ మధ్యనే టైట్ ఫైట్ నడిచే అవకాశాలున్నాయి. బీజేపీ బలం దాదాపు లేదనే చెప్పాలి. ఇక వామపక్షాలు మూడు, నాలుగు నియోజకవర్గాల్లో కొంత ప్రభావం చూపగలవు. వామపక్షాలతో పొత్తు మీద బీఆర్ఎస్ భవిష్యత్తు ఆధారపడుంది. మరి చివరకు ఏమి జరుగుతుందో చూడాలి.