రష్యా vs ఉక్రెయిన్ – ఇండియా ఎవరివైపో చెప్పిన మోడీ

ప్రపంచమంతా ఉత్కంఠగా ఎదురుచూస్తున్న సమావేశం ఢిల్లీలోని హైదరాబాద్ హౌస్‌లో జరిగింది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, భారత ప్రధాని నరేంద్ర మోదీ ముఖాముఖి భేటీ అయ్యారు. ఉక్రెయిన్ యుద్ధం మొదలై దాదాపు నాలుగేళ్లు కావస్తున్నా, ఇంకా బాంబుల మోత ఆగిపోలేదు. ఈ నేపథ్యంలో మోదీ చేసిన వ్యాఖ్యలు అంతర్జాతీయ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. పుతిన్ పక్కనే కూర్చుని, మోదీ భారత వైఖరిని చాలా క్లియర్‌గా, గట్టిగా చెప్పారు.

సాధారణంగా ఉక్రెయిన్ రష్యా యుద్ధం విషయంలో భారత్ “తటస్థంగా” ఉంటోందని పశ్చిమ దేశాలు విమర్శిస్తుంటాయి. అంటే ఎవరి వైపు ఉండకుండా సైలెంట్‌గా ఉంటోందని వారి ఉద్దేశం. కానీ మోదీ ఆ అపోహను పటాపంచలు చేశారు. “భారత్ న్యూట్రల్ కాదు.. మేం శాంతి పక్షం. మా మద్దతు ఎప్పుడూ శాంతికే ఉంటుంది. ఈ యుద్ధానికి ఒక పరిష్కారం దొరకాలని మేం కోరుకుంటున్నాం” అని పుతిన్ కళ్లలో కళ్లు పెట్టి మరీ చెప్పారు.

మోదీ మాటలకు పుతిన్ కూడా సానుకూలంగా స్పందించారు. ఉక్రెయిన్ విషయంలో శాంతి స్థాపనకు భారత్ చూపిస్తున్న శ్రద్ధకు, చేస్తున్న ప్రయత్నాలకు కృతజ్ఞతలు తెలిపారు. యుద్ధం ముచ్చట్లే కాకుండా, ఇద్దరు నేతలు అభివృద్ధి గురించి కూడా మాట్లాడుకున్నారు. మిలిటరీ, స్పేస్ డెవలప్‌మెంట్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వంటి కీలక రంగాల్లో రెండు దేశాలు కలిసి ముందుకు వెళ్లాలని డిసైడ్ అయ్యారు.

నిజానికి ఇది భారత్‌కు ఒక రకంగా కత్తి మీద సాము లాంటిదే. ఒక పక్క అమెరికా ఉక్రెయిన్ శాంతి ఒప్పందం కోసం ప్రపంచ దేశాలను కూడగడుతోంది. మరోపక్క మన చిరకాల మిత్రుడు రష్యా యుద్ధం ఆపడం లేదు. ఈ రెండింటి మధ్య బ్యాలెన్స్ చేయడం మోదీకి పెద్ద సవాలు. కానీ “మేం శాంతి వైపు” అని చెప్పడం ద్వారా, భారత్ ఎవరి ఒత్తిడికి తలొగ్గదని, తనకంటూ ఒక సొంత స్టాండ్ ఉందని మోదీ ప్రపంచానికి చాటిచెప్పారు.

ఈ 23వ ఇండియా రష్యా సమ్మిట్ చాలా కీలకమైన సమయంలో జరుగుతోంది. యుద్ధం ఆపడంలో భారత్ మధ్యవర్తిత్వం వహిస్తుందా? లేదా కేవలం వాణిజ్యానికే పరిమితం అవుతుందా? అనేది చూడాలి. కానీ ఒక్కటి మాత్రం నిజం.. భారత్ ఇప్పుడు కేవలం ప్రేక్షక పాత్రలో లేదు, గ్లోబల్ పీస్ కోసం యాక్టివ్ రోల్ ప్లే చేయడానికి సిద్ధంగా ఉందని ఈ భేటీ నిరూపించింది.