బీఆర్ఎస్ కు ఊహించని షాక్

పాలమూరు జిల్లాలో బీఆర్ఎస్ కు ఊహించని షాక్ తగిలింది. షెడ్యూల్ ఎన్నికలు దగ్గరపడుతుండటంతో అధికార పార్టీ నేతల్లో రకరకాల టెన్షన్లు పెరిగిపోతున్నాయి. సిట్టింగులకు మళ్ళీ టికెట్లిస్తారో ఇవ్వరో అనే టెన్షన్. మొదటిసారి ఎంఎల్ఏ టికెట్ కోసం ప్రయత్నిస్తున్నవాళ్ళకి అవకాశం వస్తుందో రాదో అన్న టెన్షన్. రాబోయే ఎన్నికల్లో అధికారంలోకి వస్తుందో రాదో అని మరికొందరిలో టెన్షన్. ఈ నేపధ్యంలోనే అవకాశం ఉన్నవారు ఇపుడే కాంగ్రెస్ అగ్రనేతలతో టికెట్ విషయంలో హామీ తీసుకుని పార్టీ మారిపోతున్నారు.

మరికొందరు నేతలు ఎన్నికల నోటిఫికేషన్ వచ్చేంతవరకు వెయిట్ చేసి టికెట్ విషయం తేల్చుకుని అప్పుడే పార్టీ మారుదామని ఎదురుచూస్తున్నారు. ఈ నేపధ్యంలోనే గద్వాల జిల్లా పరిషత్ ఛైర్ పర్సన్ సరిత ఈ మధ్యనే ఢిల్లీలో పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆధ్వర్యంలో పార్టీలో చేరారు. సరిత గద్వాల అసెంబ్లీకి పోటీచేయాలని ప్లాన్ చేస్తున్నారు. దాంతో తన బలం పెంచుకోవటంలో భాగంగా సరిత భర్త తిరుపతయ్య చక్రం తిప్పారు. ఎలాగంటే గద్వాల జిల్లాలోని 42 మంది నేతలు బీఆర్ఎస్ ను వదిలేసి కాంగ్రెస్ లో చేరిపోయారు.

చేరిన వారిలో 30 మంది సర్పంచులు, 12 మంది ఎంపీటీసీలున్నారు. ఇంకా కొందరు తొందరలోనే కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశాలున్నట్లు సమాచారం. ఒకేసారి దిగువస్ధాయిలోని ప్రజాప్రతినిధులు ఇంతమంది బీఆర్ఎస్ కు రాజీనామా చేస్తారని కేసీయార్ తో పాటు ఎవరు కూడా ఊహించుండరు. ఈమధ్యనే మరో సీనియర్ నేత జూపల్లి కృష్ణారావుతో పాటు ఆయన నాయకత్వంలో చాలామంది బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ లో చేరిన విషయం తెలిసిందే.

ఇలా నియోజకవర్గాలకు నియోజకవర్గాల్లోని నేతలు, ప్రజాప్రతినిధులు కాంగ్రెస్ లో చేరటంతో బీఆర్ఎస్ అగ్రనాయకత్వానికి చాలా ఇబ్బందిగా మారుతోంది. రాబోయే ఎన్నికల్లో జిల్లాలోని అన్నీ సీట్లను కాంగ్రెస్ పార్టీయే గెలుచుకోవాలని గాంధీభవన్లో పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి చెప్పారు. బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ లో చేరినందకు సంతోషంగా ఉందని రేవంత్ అన్నారు. మొత్తానికి చాపకింద నీరులాగ రేవంత్ చాలామంది బీఆర్ఎస్ నేతలను హస్తంపార్టీలోకి లాగేసుకుంటున్నారు.