నోరు అదుపులో పెట్టుకోక‌పోతే… కోడిగుడ్లే ప‌డ‌తాయి: సుప్రీంకోర్టు

“దేశానికి స్వాతంత్య్రం తీసుకువ‌చ్చేందుకు మ‌న వాళ్లు తుపాకీ తూటాల‌కే వెనుకాడ‌లేదు. మీరు ఎంపీ అయి ఉండి.. కోడిగుడ్ల‌కు భ‌య‌ప‌డ‌తారా?“అంటూ.. తృణ‌మూల్ కాంగ్రెస్ పార్టీకి చెందిన మ‌హిళా ఎంపీ మొహ‌వా మెయిత్రీని సుప్రీంకోర్టు ప్ర‌శ్నించింది. ప్ర‌జాస్వామ్యంలో నిర‌స‌న‌ల‌కు కూడా ప్రాధాన్యం ఉంద‌ని పేర్కొంది. ఎంత‌సేపు.. పూలు మాత్ర‌మే కోరుకునే నాయ‌కులు క‌నిపిస్తున్నార‌ని.. అదేస‌మ‌యంలో ప్ర‌జ‌ల నుంచి వ‌చ్చే అన్నింటినీ భ‌రించాల‌ని వ్యాఖ్యానించింది. ఆమెకు ర‌క్ష‌ణ క‌ల్పించాల‌న్న వాద‌న‌ను కూడా తిర‌స్క‌రించింది. ప్ర‌జ‌ల మ‌ధ్య ఉండే నాయ‌కుల‌కు కోడిగుడ్లు ఒక లెక్కా? అని వ్యాఖ్యానించ‌డం గ‌మ‌నార్హం.

ఏం జ‌రిగింది?

ప‌శ్చిమ బెంగాల్ కొత్త ముఖ్య‌మంత్రి సువేందు అధికారిని ఉద్దేశించి తృణ‌మూల్ కాంగ్రెస్ ఎంపీ మొహువా తీవ్ర వ్యాఖ్య‌లు చేశారు. దీనిపై కేసు న‌మోదైంది. ఈ క్ర‌మంలో కోల్‌క‌తాలోని పోలీసు స్టేష‌న్‌కు హాజ‌రు కావాల‌ని ఆమెకు పోలీసులు నోటీసులు ఇచ్చారు. అయితే.. ఆమె అక్క‌డ‌కు వెళ్లేందుకు తిర‌స్క‌రించారు. బీజేపీ కార్య‌క‌ర్త‌లు త‌న‌పై దాడి చేసే అవ‌కాశం ఉంద‌ని పేర్కొన్నారు. ఈ క్ర‌మంలోనే హైకోర్టును ఆశ్ర‌యించారు. వ‌ర్చువ‌ల్‌గా స్టేష‌న్‌లో హాజ‌ర‌య్యేందుకు అనుమ‌తి ఇవ్వాల‌ని ఆమె కోరారు. అయితే.. ఆమె అభ్య‌ర్థ‌న‌ను హైకోర్టు తిర‌స్క‌రించింది. ప్ర‌జాస్వామ్యంలో నాయ‌కులు దాడుల‌కు భ‌య ప‌డ‌రాద‌ని.. ముందుగా మీరు శాంతి సందేశం ఇవ్వ‌చ్చ‌ని పేర్కొంది.

అయితే.. హైకోర్టు ఉప‌శ‌మ‌నం ఇవ్వ‌ని నేప‌థ్యంలో ఎంపీ నేరుగా సుప్రీంకోర్టును ఆశ్ర‌యించారు. ఈ పిటిష‌న్‌ను తాజాగా విచారించిన న్యాయ‌స్థానం.. కోడిగుడ్లతో దాడి చేస్తారని, అందుకే స్టేష‌న్‌కు వెళ్ల‌బోన‌ని పేర్కొన్న ఆమె వాద‌న‌ను సుప్రీం ధర్మాసనం తోసిపుచ్చింది. “ఓ ఎంపీగా ఉన్న వ్యక్తి కోడి గుడ్లకు భయపడుతారా?“ అని ధ‌ర్మాస‌నం వ్యాఖ్యానించింది. హైకోర్టు ఉత్త‌ర్వుల్లో జోక్యం చేసుకునేది లేద‌ని తేల్చి చెప్పింది. ముందు నోరు చేసుకోవ‌డం.. త‌ర్వాత దాడులు చేస్తార‌ని కోర్టును ఆశ్ర‌యించ‌డం నాయ‌కుల‌కు ప‌రిపాటిగా మారింద‌ని వ్యాఖ్యానించింది.

ఏదైనా మాట్లాడేప్పుడు ఉండాల్సిన భ‌యం.. త‌ర్వాత ఉంటే ఎలా ? కోడిగుడ్ల‌కు భ‌య‌ప‌డ‌తారా? అంటూ.. పేర్కొంది. నోరు అదుపులో పెట్టుకోక‌పోతే.. కోడిగుడ్లే ప‌డ‌తాయేమో.. అని వ్యాఖ్యానించ‌డం గ‌మ‌నార్హం. హైకోర్టు ఇచ్చిన ఆదేశ‌ల‌ను ర‌ద్దు చేయ‌లేమ‌ని, వ‌ర్చువ‌ల్‌గా కూడా హాజ‌ర‌య్యేందుకు అనుమ‌తి ఇవ్వ‌లేమ‌ని స్ప‌ష్టం చేసింది.  ఈ కేసులో ఎలాంటి ఉప‌శ‌మ‌నం క‌ల్పించ‌లేమ‌ని స్ప‌ష్టం చేసింది. దీంతో మొహువా స్టేష‌న్‌కు హాజ‌రు కాక‌త‌ప్ప‌ని ప‌రిస్థితి ఏర్ప‌డింది.