బీజేపీ ఓటు పాలిటిక్స్‌.. పురందేశ్వ‌రికి పెద్ద టాస్కే!

ఏపీ బీజేపీకి సంబంధించి క‌మ‌ల నాథులు తీసుకున్న నిర్ణ‌యం.. సంచ‌ల‌న‌మ‌నే చెప్పాలి. పార్టీ అధ్య‌క్ష ప‌గ్గాలు చేప‌ట్టిన ఆర్ ఎస్ ఎస్ యేత‌ర‌.. రెండో వ్య‌క్తిగా అన్న‌గారు ఎన్టీఆర్ గారాల‌ప‌ట్టి, కేంద్ర మాజీ మంత్రి ద‌గ్గుబాటి పురందేశ్వ‌రి ఎంపిక ప‌రంగా రికార్డు సృష్టించారు. అతి పెద్ద బీజేపీలో ఈ స్థాయిలో ఒక మ‌హిళ‌కు అవ‌కాశం ద‌క్క‌డం అంత చిన్న విష‌యం ఏమీ కాదు. అదే స‌మ‌యంలో ఏపీలోనూ బ‌లం పుంజుకోవాల‌ని భావిస్తున్న బీజేపీ నేత‌లు.. వాస్త‌వానికి ఇక్క‌డ సోము వీర్రాజు స్థానంలో మ‌రొక కీల‌క నేత‌కు ప‌గ్గాలు అప్ప‌గిస్తార‌ని అంద‌రూ భావించారు. ఈ ప‌రంప‌ర‌లో స‌త్య‌కుమార్ యాద‌వ్‌పేరు ప్ర‌ముఖంగా వినిపించింది.

దీనిపైనే రాజ‌కీయంగా కూడా అంచ‌నాలు వ‌చ్చాయి. అయితే.. ఎవ‌రూ ఊహించ‌ని విధంగా పురందేశ్వ‌రికి పార్టీ అధిష్టానం ప‌చ్చ జెండా ఊపింది. అయితే.. ఆమె ప‌ద‌వి ఇవ్వ‌డం వెనుక‌.. చాలా వ్యూహ‌మే ఉంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. ప్ర‌ధానంగా వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఎన్టీఆర్ సింప‌తీని వాడుకునే వ్యూహంతోనే క‌మ‌ల నాథులు ఆయ‌న కుమార్తెకు ప‌గ్గాలు అప్ప‌గించి ఉంటార‌ని భావిస్తున్నారు. ప్ర‌స్తుతం ఎన్టీఆర్ సింప‌తీ చుట్టూ.. టీడీపీ ప‌య‌నిస్తోంది. ఇక‌, దీని నుంచి అంతో ఇంతో ఓటు బ్యాంకును త‌మ సొంతం చేసుకునేందుకు .. అధికార పార్టీ వైసీపీ కూడా ప్ర‌య‌త్నిస్తున్న ప‌రిస్థితి క‌నిపిస్తోంది.

ఈ రెండు పార్టీల మ‌ధ్య ఇప్పుడు ఏకంగా అన్న‌గారి కుమార్తెకు పార్టీని అప్ప‌గించ‌డం ద్వారా.. బీజేపీ చాలా వ్యూహాత్మ‌క అజెండానే ఎంచుకున్న‌ట్టు తెలుస్తోంది. సింప‌తీ పాళ్ల‌ను మ‌రింత రంగ‌రించి.. నంద‌మూరి సానుభూతి ఓట్ల‌ను త‌న‌వైపు తిప్పుకొనే ప్ర‌య‌త్నంలో భాగంగానే పురందేశ్వ‌రికి ఈ ‘అవ‌కాశం’ ఇచ్చిన‌ట్టు విశ్లేష‌కులు భావిస్తున్నారు. అయితే.. సంస్థాగ‌తంగా టీడీపీకి మాత్ర‌మే ప‌రిమిత‌మైన అన్నగారి సింప‌తీ ఓట్లు.. బీజేపీ వైపు మ‌ళ్లించి.. ఆ పార్టీని బ‌లోపేతం చేయ‌డం.. ఇప్పుడు పురందేశ్వ‌రి ముందు.. పార్టీ పెద్ద‌లు పెట్టిన అతి పెద్ద టాస్క్‌గా భావించాల్సి ఉంటుంది.

ఇక‌, వ్య‌క్తిగ‌తంగా చూసుకుంటే.. పురందేశ్వ‌రి.. ఇప్ప‌టి వ‌ర‌కు రెండు పార్టీలు మారారు. గ‌తంలో కాంగ్రెస్‌.. త‌ర్వాత బీజేపీ. కాంగ్రెస్‌లో ఉన్న‌ప్పుడు.. కేంద్ర మంత్రి గా ఆమె చ‌క్రం తిప్పారు. ఇక‌, రాష్ట్ర విభ‌జ‌న త‌ర్వాత ఆమె బీజేపీలోకి వ‌చ్చారు. అయితే.. ఏ పార్టీలో ఉన్నా.. రాష్ట్ర నేత‌ల‌తో ఆమెకు ఉన్న ప‌రిచ‌యాలు అంతంత మాత్ర‌మ‌నే చెప్పాలి. కాంగ్రెస్‌లో ఉండ‌గా.. కేంద్రంలోని పెద్ద‌ల‌తోనే త‌న ప‌రిచ‌యాల‌ను పెంచుకున్నారు. ఇప్పుడు బీజేపీలోనూ రాష్ట్ర నేత‌ల‌తో పెద్ద‌గా ఆమెకు స‌ఖ్య‌త లేదు. కేంద్రంలోని పెద్ద‌ల‌తోనే ఆమెకు ప‌రిచ‌యాలు మెండుగా ఉన్నాయి. ఇలాంటి స‌మ‌యంలో అత్యంత కీల‌క‌మైన ఎన్నికల స‌మ‌యంలో ఏపీ ప‌గ్గాలు అందుకోనున్న పురందేశ్వ‌రి.. రాష్ట్ర నేత‌ల‌ను ఎలా ముందుండి న‌డిపిస్తారు.. బీజేపీని ఎలా బ‌లోపేతం చేస్తారు? అనేది ఆమెకు రాజ‌కీయంగా ప‌రీక్ష అనే చెప్పాలి. చూడాలి ఎలా ముందుకు సాగుతారో.