బండి, నడ్డాలపై రఘునందన్ షాకింగ్ వ్యాఖ్యలు

దుబ్బాక ఎమ్మెల్యే, బీజేపీ నేత రఘునందన్ రావు సొంత పార్టీపై కొంతకాలంగా అలకబూనిన సంగతి తెలిసిందే. బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి, ఫ్లోర్ లీడర్, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడులలో ఏదో ఒక పదవి కావాలని ఆశించి భంగపడ్డ రఘునందన్ రావు తన అనుచరుల దగ్గర అసహనం వ్యక్తం చేశారని ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే బీజేపీ హై కమాండ్ తన డిమాండ్ నెరవేర్చకుంటే కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుందని రఘునందన్ సంచలన వ్యాఖ్యలు చేసినట్టుగా పుకార్లు వస్తున్నాయి.

ఈ క్రమంలోనే పార్టీకి సేవ చేసిన వారికి తగిన గుర్తింపు లభించడం లేదని తన అనుచరులు, స్నేహితులు దగ్గర రఘునందన్ రావు వాపోయినట్టుగా పుకార్లు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఆ పుకార్లను నిజం చేస్తూ ఏకంగా బీజేపీ పెద్దలపై రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాపై రఘునందన్ షాకింగ్ కామెంట్స్ చేశారు. పార్టీలో తనకు తగిన గౌరవం, గుర్తింపు ఇవ్వాలని, తన సేవలకు తగిన ప్రతిఫలం దక్కకుంటే బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డాపై ప్రధాని మోడీకి ఫిర్యాదు చేస్తానని షాకింగ్ కామెంట్స్ చేశారు. ఈ రోజు బీజేపీ పెద్దలకు పిలుపుమేరకు ఢిల్లీ వెళ్ళిన రఘునందన్ రావు….కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి నివాసంలో మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.

పదిహేడేళ్లుగా పార్టీ కోసం కష్టపడుతున్నానని, తెలంగాణ బీజేపీ అధ్యక్ష పదవికి తాను అర్హుడిని కాదా అని ప్రశ్నించారు. దుబ్బాకలో తన విజయం బీజేపీ కొత్త ఊపునిచ్చిందని, అది చూసే ఈటెల రాజేందర్ బీజేపీలో చేరారని అన్నారు. తనకు బీజేపీ తెలంగాణ అధ్యక్ష పదవి, లేదంటే బీజేపీ ఫ్లోర్ లీడర్ పదవి, లేదంటే బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి పదవి… ఈ మూడింటిలో ఏదో ఒకటి ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. తన కులమే తనకు శాపం కావచ్చని, కానీ రెండు నెలల్లో బిజెపి ఎలా ఉంటుందో అందరికీ తెలుస్తుందని అన్నారు. దుబ్బాక నుండి మరోసారి ఎమ్మెల్యేగా తానే గెలుస్తానని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

మునుగోడులో 100 కోట్లు పెట్టినా గెలవలేదని, ఆ డబ్బు తనకిస్తే తెలంగాణను దున్నేసేవాడినని రఘునందన్ రావు అన్నారు. దుబ్బాకలో తనను చూసే జనం ఓట్లు వేసి గెలిపించాలని వ్యాఖ్యానించారు. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా బండి సంజయ్ స్థానంలో మరొకరిని నియమించబోతున్నది వాస్తవమేనని ఆయన కన్ఫర్మ్ చేశారు. అయితే, బండి సంజయ్ ది స్వయంకృతాపరాధమని, పుస్తెలు తాకట్టు పెట్టి ఎన్నికల్లో పోటీ చేసిన బండి సంజయ్…వందల కోట్లతో ప్రకటనలు ఎలా ఇస్తున్నారని ప్రశ్నించారు.