అందుకోస‌మే కాంగ్రెస్‌లో చేరుతున్నా: పొంగులేటి

కొన్ని రోజులుగా తెలంగాణ రాజ‌కీయాల్లో ఉత్కంఠ‌గా మారిన మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస‌రెడ్డి రాజ‌కీయ వ్య‌వ‌హారానికి తాజాగా ఫుల్ స్టాప్ ప‌డింది. తాను కాంగ్రెస్‌లో చేరుతున్న‌ట్టు ఆయ‌న ప్ర‌క‌టించారు. అయితే.. దీనికి ఏకైక కార‌ణం.. కేసీఆర్ నేతృత్వంలోని బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని గద్దె దించేందుకేన‌ని పొంగులేటి చెప్పారు. తాజాగా ఢిల్లీలో కాంగ్రెస్ అగ్ర‌నేత‌ రాహుల్‌గాంధీ, కాంగ్రెస్ ఏఐసీసీ అధ్య‌క్షుడు మల్లిఖార్జున ఖర్గేతో పొంగులేటి స‌మావేశం అయ్యారు. అనంత‌రం  ఆయ‌న మాట్లాడుతూ.. పదవులు ఇవ్వలేదని బీఆర్ఎస్ నుంచి బయటకు రాలేదన్నారు.

బీఆర్ ఎస్ పార్టీనే త‌మ‌ను ప‌క్క‌న పెట్టింద‌ని పొంగులేటి వ్యాఖ్యానించారు. బీఆర్ఎస్‌ను గద్దె దించేందుకే తాను కూడా బయటకు వచ్చి కాంగ్రెస్‌లో చేరుతున్నట్లు తెలిపారు.  “నాకు పదవులు ముఖ్యం కాదు.  పదవుల కంటే ఆత్మాభిమానమే ముఖ్యం. ఓ దశలో ప్రాంతీయ పార్టీ పెట్టాలని ఆలోచించా. దీనిపై అభిప్రాయ సేకరణ కూడా చేశా. కొత్త పార్టీతో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలదని భావించి కాంగ్రెస్‌లో చేరాలని నిర్ణయించుకున్నా” అని పొంగులేటి వివ‌రించారు.

రాష్ట్రంలోని పరిస్థితులపై కూడా సర్వే చేయించానన్నారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు అంతా ఒకవైపే కేంద్రీకృతమైందని, దీనిని తాను గుర్తించాన‌ని పొంగులేటి వెల్లడించారు. మ‌రోవైపు ఈ ఏడాది జ‌రిగిన కర్ణాటక ఎన్నిక‌ల త‌ర్వాత తెలంగాణలో కాంగ్రెస్ గ్రాఫ్ పెరిగింద‌న్నారు.  బీజేపీ పరిస్థితి దిగజారిందని పేర్కొన్నారు. ఎన్నికలు వచ్చాయంటే కేసీఆర్ కొత్త స్కీములు పెడతారని.. గారడి మాటలు చెప్పడంలో ఆయ‌న సిద్ధ‌హ‌స్తుడ‌ని వ్యాఖ్యానించారు. ఇప్పుడు జ‌రిగే ఎన్నిక‌ల్లో మూడోసారి మాయమాటలు, మాయ ప‌థ‌కాల‌తో అయినా.. మ‌రో సారి  ముఖ్యమంత్రి కావాలని కేసీఆర్ అనుకుంటున్నారని విమ‌ర్శించారు.

రాష్ట్ర వ‌చ్చినా.. తెలంగాణ బిడ్డలు కోరుకున్న నీళ్లు, నిధులు, నియామ‌కాలు మాత్రం నెరవేరలేదని పొంగులేటి చెప్పారు.  “ప్రజలు, యువత ఏం కోరుకుంటున్నారనేది పరిశీలించాం.. తెలంగాణ బిడ్డలు ఆత్మగౌరవం కోల్పోయారు. దానిని సాధిస్తాం. ప్ర‌తి ఒక్క‌రి ఆత్మ‌గౌర‌వాన్ని పెంచుతాం” అని తెలిపారు. జూలై 2 ఖమ్మంలో జరిగే బహిరంగ సభలో రాహుల్ సమక్షంలో కాంగ్రెస్‌లో చేరుతున్నట్లు పొంగులేటి స్పష్టం చేశారు.