జ‌గ‌న్‌.. నా విప్ల‌వ పంథా చూస్తే.. త‌ట్టుకోలేవ్‌

ఏపీ సీఎం జ‌గ‌న్‌పై జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ తీవ్ర‌స్థాయిలో రెచ్చిపోయారు. జ‌గ‌న్‌.. నా విప్ల‌వ పంథా చూస్తే.. త‌ట్టుకోలేవ్‌ అని వార్నింగ్ ఇచ్చారు. సీఎంగా జగన్ బాగా పరిపాలించి ఇంకోసారి గెలిచినా త‌న‌కు అభ్యంతరం లేదని ప‌వ‌న్ వ్యాఖ్యానించారు. అయిత‌.. జ‌న‌సేన త‌ర‌ఫున ఎవ‌రూ పోటీ చేయ‌కూడ‌ద‌ని.. ఎవ‌రూ బ‌రిలోకి నిల‌బ‌డ‌కూడ‌ద‌ని హెచ్చ‌రించినా.. వారి ఓట్లు తీసేసే ప్ర‌య‌త్నం చేసినా.. త‌న విశ్వ‌రూపం చూపిస్తాన‌ని ప‌వ‌న్ వ్యాఖ్యానించారు. “ఇప్పుటిదాకా రాజకీయ నాయకుడిని మాత్రమే చూశారు. కానీ విప్లవపంథాతో ఉన్న రాజకీయ నాయకుడిని జగన్ చూడలేడు’‘ అని సీఎం జగన్‌ను తీవ్ర‌స్థాయిలో హెచ్చరించారు.

ఆదివారం రాత్రి పొద్దు పోయాక తూర్పుగోదావ‌రి జిల్లాలోని మ‌లికిపురంలో ప‌వ‌న్ వారాహి యాత్ర చేశారు. ఈ సంద‌ర్భంగా తొలుత జ‌న‌సేన నాయ‌కుల‌తో ఆయ‌న భేటీ అయ్యారు. అనంతరం మ‌లికిపురం సెంట‌ర్‌కు చేరుకుని వారాహి వాహ‌నం నుంచి ప్ర‌సంగించారు. సీఎం జ‌గ‌న్‌పై తనకు వ్యక్తిగతంగా ద్వేషంలేదన్నారు. కానీ సీఎం అయ్యాక తాను సర్వాధికారిని.. అందరూ తన బానిసలంటే.. నీ బాంచన్ దొర అంటూ.. నీ కాళ్లుమొక్కే వ్యక్తులంకాదని.. అదే త‌న‌కు ఎక్క‌డాలేని కోపం తెప్పించింద‌ని ప‌వ‌న్ అన్నారు.

క‌ళ్ల‌జోడు ప‌డింది!

పార్టీ పెట్టిన‌ప్పుడు.. త‌ర్వాత కూడా.. త‌న‌కు క‌ళ్ల‌జోడు లేద‌ని.. కానీ, వైసీపీ అధికారంలోకి వ‌చ్చాక‌.. ఆ పార్టీ నాయ‌కులు, మంత్రులు చేస్తున్న అవినీతిని పుస్త‌కాలు.. పేప‌ర్ల‌లో చదివేకొద్దీ తన కళ్ల సైట్ పెరిగిపోయి.. క‌ళ్ల‌జోడు పెట్టుకునే ప‌రిస్థితి వ‌చ్చింద‌ని పవన్‌ అన్నారు. గోదావరి జిల్లాల్లో క్రిమినాలిటీని, చైన్ గ్యాంగ్స్, రౌడీ గ్యాంగ్స్‌ను తీసుకురావద్దని వైసీపీ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. చైన్ గ్యాంగ్స్, రౌడీ గ్యాంగ్స్‌ను పులివెందుల, ఇడుపులపాయలో పెట్టుకోవాలని అన్నారు. వైసీపీ ప్రొత్సాహంతో క్రిమినల్స్ దాడి చేద్దామని చూస్తే.. తాను విప్లవకారుడినని, రౌడీలు, క్రిమినల్స్, ఫ్యాక్షనిస్టులకు భయపడే వ్యక్తిని కాదని హెచ్చరించారు.

ప్ర‌తిదానికీ కేసా?

రాజ‌కీయ నాయ‌కులు ఏం మాట్లాడినా కేసులు పెడుతున్నార‌ని ప‌వ‌న్ వ్యాఖ్యానించారు. అభివృద్ధిపై మాట్లాడినా కేసులు పెడతామని బెదిరిస్తున్నారని.. ఇది జ‌గ‌న్ సొంత రాష్ట్ర‌మే కానీ.. సొంత సొత్తు కాద‌ని వ్యాఖ్యానించారు. గ‌త 2019 ఎన్నిక‌ల్లో రాజోలు విజయం గాయపడ్డ గుండెకు సేదతీరినట్లయిందని, అయితే.. ఆ ఎమ్మెల్యే కూడా కాసుల‌కు క‌క్కుర్తి ప‌డి రౌడీల పంచ‌న చేరిపోయాడ‌ని వ్యాఖ్యానించారు. కులాల మధ్య చిచ్చుపెట్టడానికి తాను రాలేదని, కులాలను కలపడానికి రాజకీయాల్లోకి వచ్చానని పవన్‌ అన్నారు.