ప్ర‌తిప‌క్షాల‌కు అజెండా లేకుండా చేశాం… సీఎం జ‌గ‌న్

రాష్ట్రంలో ప్ర‌తిప‌క్షాల‌కు అజెండా లేకుండా చేశామ‌ని.. వారికి ఇప్పుడు ప‌ని కూడా లేకుండా పోయింద‌ని సీఎం జ‌గ‌న్ వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో తాజాగా ‘‘జగనన్న సురక్ష’’ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి ప్రారంబించారు. శుక్రవారం తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో జ‌రిగిన కార్య‌క్ర‌మంంలో సీఎం మాట్లాడుతూ.. గతంలో ఏ పని కావాలన్నా గవర్నమెంట్ ఆఫీస్‌ల చుట్టూ తిరగాల్సి వచ్చేదని.. ఈ ప్రభుత్వం వచ్చాక పారదర్శకంగా పౌర సేవలు అందిస్తున్నామన్నారు.

రాష్ట్రంలో ఎక్కడా లంచం లేకుండా పథకాలు గ్రామ స్థాయిలో అందిస్తున్నామని తెలిపారు. నవరత్నాల ద్వారా నాలుగేళ్లలో 2 లక్షల 16 వేల కోట్లు అందించామని చెప్పారు. వీటితో పాటు ఇతర సంక్షేమ పధకాలు అందించామన్నారు. అర్హులు ఎవ్వరూ మిగిలి పోకుండా ఉండేందుకు 6 నెలలకు ఒక సారి అవకాశం ఇచ్చామని తెలిపారు. అలాగే జగన్నన్నకు చెబుదాం అని తన దృష్టికి తీసుకురావాలని చెప్పామన్నారు. ఇంకా ఎవ్వరైనా మిగిలి పోయినా వారికి ప్రభుత్వ లబ్ధి కోసం జగనన్న సురక్ష తీసుకువస్తున్నామని చెప్పారు.

ఈ పథకం కింద వివిధ రకాల సర్టిఫికెట్లను అందజేస్తామన్నారు. 11 రకాల సేవలు ఎలాంటి సర్వీస్ చార్జి లేకుండా అందచేస్తున్నమని ముఖ్య‌మంత్రి తెలిపారు. రాష్ట్రంలోని కోటి 60 లక్షల ఇళ్లకు వెళ్లి లబ్ది అందని వారికి సురక్ష ద్వారా అందిస్తామని సీఎం జగన్ వెల్లడించారు. అయితే.. ఇదే వేదిక‌పైనుంచి సీఎం జ‌గ‌న్ రాజ‌కీయ వ్యాఖ్య‌లు చేశారు. ప్ర‌తిప‌క్షాల‌కు ప‌నిలేకుండా పోయింద‌ని అన్నారు. ఇప్పుడు ప్రతిపక్షాలకు అజెండా లేకుండా చేశామని వ్యాఖ్యానించారు.

వ‌చ్చే ఎన్నిక‌ల్లో ప్ర‌జ‌లకు ఎలాంటి హామీలు ఇవ్వాలో తెలియ‌క‌.. వైసీపీ మేనిఫెస్టోను కాపీకొడుతున్న ప‌రిస్థితిని అంద‌రూ గ‌మ‌నించార‌ని సీఎం వ్యాఖ్యానించారు. ప్ర‌తిప‌క్షాలు ఒక‌ప్పుడు యాక్టివ్‌గా ఉండేవ‌ని.. దీనికి కార‌ణం.. అప్ప‌టి ప్ర‌బుత్వాలు ప్ర‌జ‌ల‌ను ప‌ట్టించుకోక‌పోవ‌డ‌మేన‌ని చెప్పారు. కానీ, ఇప్పుడు ప్ర‌తిప‌క్షాల‌కు చేద్దామ‌న్నా ప‌నిలేకుండా పోయింద‌ని జ‌గ‌న్ వ్యాఖ్యానించారు.