మొత్తానికి అవినాష్‌ను అలా సైడ్ చేశారా?

Viveka

ఓ ప‌ది రోజుల కింద‌టి వ‌ర‌కు.. ఎటు విన్నా.. ఎటు చూసినా.. వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి చుట్టూ రాజ‌కీయా లు న‌డిచాయి. ఎవ‌రి నోట విన్నా.. అవినాష్ అరెస్టు అంశం తార‌స్థాయిలో చ‌ర్చ‌కు వ‌చ్చింది. ఇంకేముంది ఆయ‌న అరెస్టు అయిపోతున్నారంటూ.. మీడియా కోడై కూసింది. బ్రేకింగులు.. చ‌ర్చ‌లు.. అబ్బో ఆ వార్త‌లే వేరు. అన్న‌ట్టుగా సాగిన ఈ వ్య‌వ‌హారం గ‌డిచిన ప‌ది రోజులుగా అస‌లు ఊసే లేకుండా పోయింది.

ఇప్పుడు ఎక్క‌డ విన్నా.. ఆయ‌న గురించిన చ‌ర్చ వినిపించ‌డం లేదు. క‌నీసం అవినాష్‌రెడ్డి గురించిన మాటే ఎక్క‌డా క‌నిపించ‌డం లేదు. మొత్తానికి ఈ ప‌రిణామాల‌ను గ‌మ‌నిస్తున్న వారు.. అవినాష్‌ను అలా సైడ్ చేశారా? అనే వ్యాఖ్య‌లు వినిపిస్తున్నాయి. ప్ర‌స్తుతం ఆయ‌న అరెస్టు గురించిన వార్త‌లు వినిపించ డ‌మే లేదు. ఇక‌, మ‌రోవైపు.. పులివెందుల‌లో అవినాష్‌రెడ్డి మాతృమూర్తి శ్రీల‌క్ష్మి.. యథావిథిగా త‌న ప‌ని తాను చేసుకుంటున్నారు.

అదే స‌మయంలో ముందస్తు బెయిల్ ద‌క్కించుకున్న అవినాష్‌రెడ్డి నియోజ‌క‌వ‌ర్గంలో గ‌డ‌ప‌గ‌డ‌ప‌కు కార్య‌క్ర‌మాన్ని ముమ్మ‌రం చేశారు. తాజాగా ఆయ‌న క‌డ‌ప జిల్లాలోకి క‌డ‌ప నియోజ‌క‌వ‌ర్గంలో ప‌ర్య‌టించారు. ఇక్క‌డి స‌మ‌స్య‌లు తెలుసుకున్నారు. అయితే.. చిత్రంగా నిన్న మొన్న‌టి వ‌ర‌కు అవినాష్ గురించి ఆందోళ‌న చేసిన వారు కూడా ఇప్పుడు సైలెంట్ అయ్యారు. ఎక్క‌డా వారు కూడా ప‌న్నెత్తు మాట అన‌డం లేదు. క‌నీసం.. అవినాష్‌రెడ్డి అరెస్టు విష‌యాన్ని కూడా ఎవ‌రూ స్మ‌రించ‌డం లేదు.

ఈ ప‌రిణామాల‌ను గ‌మ‌నిస్తే.. అధికారంలో ఉన్న‌వారు ఎంత బ‌లంగా ఉన్నారో అర్థ‌మ‌వుతోంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. మ‌రికొన్ని రోజులు పోతే. అస‌లు అవినాష్‌రెడ్డిఅంశం కూడా తెర‌మ‌రుగైనా ఆశ్చ‌ర్యం లేద‌ని అంటున్నారు. ఎలానూ.. ఎన్నిక‌ల మూడ్‌లో ప‌డి ప్ర‌తిప‌క్షాలు కూడా ఈ అంశాన్ని ప్ర‌స్తావించే ప‌రిస్థితి లేకుండా పోతుంద‌ని.. చెబుతున్నారు. ఏదేమైనా.. చాలా తెలివిగా.. ఎంతో ఓర్పుగా అవినాష్‌రెడ్డి అంశాన్ని సైడ్ చేశార‌ని కొద్ది మంది మాత్రం చ‌ర్చించుకుంటుండ‌డం గ‌మ‌నార్హం.