వైసీపీలో మ‌ళ్లీ అదే సీన్‌.. జ‌గ‌న్ హెచ్చ‌రిక‌లు..

ఏపీ అధికార పార్టీ వైసీపీలో మ‌రోసారి సీఎం జ‌గ‌న్ హెచ్చ‌రిక‌లు.. ఎమ్మెల్యేల్ల‌లో గుబులు తెర‌మీదికివ‌చ్చాయి. గడపగడపకు మన ప్రభుత్వం వర్క్ షాప్‌లో పలువురు ఎమ్మెల్యేలకు ముఖ్యమంత్రి జగన్ వార్నింగ్ ఇచ్చినట్లు తాడేప‌ల్లి వ‌ర్గాలు చెబుతున్నాయి. తాజాగా తాడేపల్లి క్యాంపు కార్యాయంలో సీఎం జగన్ నేతృత్వంలో జరిగిన గడపగడపకు మన ప్రభుత్వం వర్కుషాప్‌లో ఎమ్మెల్యేలు, మంత్రులు, నియోజకవర్గ సమన్వయకర్తలు, జిల్లా అధ్యక్షులు, రీజనల్ కో ఆర్డినేటర్‌లు హాజరయ్యారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యేల పనితీరుపై సమీక్షించిన సీఎం… కొంతమంది ఎమ్మెల్యేల పనితీరుపై అసంతృప్టి వ్యక్తం చేసినట్లు తెలిసింది. దాదాపు 20 మంది ఎమ్మెల్యేల పనితీరు అస్సలు బాగోలేదని తేల్చిచెప్పారు. ‘‘వీరందరికీ త్వరలోనే వ్యక్తిగతంగా పిలిచి చెబుతాను.. అప్పటికీ పనితీరు మార్చుకోపోతే నా నిర్ణయం నేను తీసుకుంటాను. మిగతా వాళ్లలో కూడా దాదాపుగా సగం మంది పనితీరు మెరుగుపరుచుకోవాల్సిందే. పనితీరు బాగుంటేనే ఎమ్మెల్యేలను కొనసాగిస్తాం. పనితీరు బాగోలేకపోతే కొనసాగించడం పార్టీకి నష్టమవుతుంది“ అని జ‌గ‌న్ తేల్చి చెప్పిన‌ట్టు తాడేప‌ల్లి వ‌ర్గాలు చెప్పాయి.

ఇప్పటి వరకూ చేసిన సర్వే వివరాలన్నీ త‌న ద‌గ్గ‌ర ఉన్నాయ‌ని సీఎం జ‌గ‌న్ వ్యాఖ్యానించారు. ఇప్ప‌టి వ‌ర‌కు ఎలా ఉన్నా.. ఇక నుంచి మాత్రం ఎమ్మెల్యేల గ్రాఫ్ పెర‌గాల్సిందేన‌ని జ‌గ‌న్ తేల్చి చెప్పిన‌ట్టు తెలిసింది. ప్రతి ఇంటికీ వెళితే గ్రాఫ్‌ పెరుగుతుందని, లేకపోతే మీ గ్రాఫ్‌ పెరగదని సీఎం జ‌గ‌న్ తేల్చి చెప్పార‌ని స‌మాచారం. పనితీరు బాగోలేని పక్షంలో టిక్కెట్లు ఇవ్వనని కూడా సీఎం జ‌గ‌న్ మ‌రో సారి హెచ్చ‌రించిన‌ట్టు స‌మాచారం. ఎన్నిక‌ల‌కు ముందు ఈ విష‌యంలో ఎంత బాధ‌ప‌డినా.. ఎన్ని తిట్టినా.. చేయ‌గ‌లిగేది ఏమీ లేద‌ని కూడా జ‌గ‌న్ స్ప‌ష్టం చేసిన‌ట్టు తెలిసింది.

సోషల్ మీడియాను ఉపయోగించుకుని ప్ర‌తిప‌క్షాలు చేస్తున్న విమ‌ర్శ‌ల‌ను తిప్పికోట్టాల‌ని సీఎం జ‌గ‌న్ పిలుపునిచ్చారు. సోషల్ మీడియా ద్వారా ప్ర‌భుత్వం చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు చేరువ చేయాల‌ని కూడా ఆయ‌న పిలుపునిచ్చిన‌ట్టు తెలిసింది. తాజా వర్క్‌షాపులో ఎమ్మెల్యేల అటెండెన్స్ తీసుకోకపోవడంపై చర్చనీయాంశంగా మారింది. జగనన్న సురక్ష కార్యక్రమాన్ని అందరూ ఛాలెంజ్‌గా తీసుకోవాలని సీఎం సూచించారు. ప్రతీ సచివాలయానికి ఎమ్మెల్యే, అధికారులు వెళ్లి కూర్చొని ప్రజల సమస్యలు తెలుసుకోవాలన్నారు. మొత్తానికి ఈ ప‌రిణామాల‌తో మ‌రోసారి వైసీపీలో క‌ల‌వ‌రం ప్రారంభ‌మైంద‌ని తాడేప‌ల్లి వ‌ర్గాలు చెబుతున్నాయి.