సునీల్ కనుగోలు తెలంగాణకి ఎంట్రీ ఇచ్చాడా?

రాబోయే ఎన్నికల్లో కచ్చితంగా గెలులుగుర్రాలకు మాత్రమే టికెట్లివ్వాలని కాంగ్రెస్ అధిష్టానం గట్టిగా అనుకున్నట్లుంది. ఇందుకనే రాజకీయ వ్యూహకర్త సునీల్ కానుగోలు మొత్తం 119 నియోజకవర్గాల్లోను విస్తృతంగా సర్వేల మీద సర్వేలు చేస్తున్నారు. గెలుపు అవకాశాలున్న అభ్యర్ధుల కోసం జల్లెడపడుతున్నారు. పార్టీపరంగా పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కూడా వివిధ మార్గాల్లో సమాచారం తెప్పించుకుంటున్నారు. అన్నింటినీ క్రోడీకరించి ఇద్దరు ముగ్గురు నేతలతో జాబితాను రెడీచేస్తున్నారు.

మొత్తం నియోజకవర్గాల్లో సుమారు 70 నియోజకవర్గాల్లో అభ్యర్ధుల ఎంపిక దాదాపు అయిపోయినట్లే అనుకుంటున్నారు. మిగిలిన 49 నియోజకవర్గాల్లోనే పోటీ బాగా ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. మాజీమంత్రులు, మాజీ ఎంఎల్ఏలు, కొందరు సీనియర్ నేతలు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాల్లో మళ్ళీ వాళ్ళకే దాదాపు టికెట్లు ఖాయమైనట్లే. ఎందుకంటే వీళ్ళతో టికెట్ కోసం పోటీ పడే వాళ్ళుండరు. మిగిలిన 49 నియోజకవర్గాల్లో టికెట్ కోసం ముగ్గురు నలుగురు నేతల మధ్య పోటీ ఎక్కువగా ఉంది.

ఉమ్మడి నల్గొండ జిల్లాలోని 12 నియోజకవర్గాల్లో దాదాపు 8 నియోజకవర్గాల్లో టికెట్లు ఖాయమైపోయిందని సమాచారం. ఖమ్మం జిల్లాలోని పది సీట్లలో ఐదు నియోజకవర్గాల్లో టికెట్లు ఖాయమైపోయిందట. అయితే ఇక్కడ మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసులరెడ్డి చేరిన తర్వాత ఏమైనా మార్పులుంటే ఉండవచ్చని గాంధీభవన్ వర్గాలు చెబుతున్నాయి. వరంగల్ జిల్లాలో ఆరు సీట్లలో అభ్యర్ధులు ఫైనల్ అయ్యారట. కరీంనగర్ జిల్లాలో కూడా ఐదు నియోజకవర్గాల్లో టికెట్లకు పెద్దపోటీ ఉండదు.

పార్టీ నేతలు చెప్పే లెక్కలు చూసిన తర్వాత 50 శాతం టికెట్లు ఖాయమైపోయినట్లు అర్ధమవుతోంది. పోటీ ఉన్న మిగిలిన నియోజకవర్గాల్లోనే సునీల్ కానుగోలు బృందానికి ఎక్కువగా పనుంది. ఈ సీట్లపైనే అధిష్టానం కూడా బాగా దృష్టిపెట్టాల్సొచ్చేట్లుంది. రేసులో ఉన్న వారిలో గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉన్న నేతకే టికెట్ ఇవ్వాలన్నది అధిష్టానం నిర్ణయంగా ఉంది. మొహమాటాలకు, ఒత్తిళ్ళకు తలొంచి టికెట్లు కేటాయిస్తే మూడోసారి కూడా ప్రతిపక్షంలోనే కూర్చోవాల్సొస్తుందని అధిష్టానికి అర్ధమైపోయింది. మూడోసారి ఎన్నికలో కూడా పార్టీ ఓడిపోతే ఇక కాంగ్రెస్ ను జనాలు మరచిపోవటం గ్యారెంటీ. అందుకనే ఎలాగైనా అధికారంలోకి రావాలని పట్టుదలగా ఉన్నది.