జగన్ మాస్టర్ మైండ్: బాబు

తెలుగుజాతి చరిత్ర తిరగరాసే రోజు వస్తుందని, రాష్ట్రాన్ని కాపాడాలని అందరూ సంకల్పం తీసుకోవాలని టీడీపీ అధినేత చంద్రబాబు పిలుపునిచ్చారు. దేశంలో తెలుగుజాతిని అగ్రస్థానంలో నిలబెట్టాలని, సహకరిస్తే సరే.. అడ్డొస్తే తొక్కుకుంటూ పోతామని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. మ‌హానాడు తొలి రోజు శ‌నివారం ప్ర‌సంగించిన ఆయ‌న ఆద్యంతం కార్య‌క‌ర్త‌ల‌ను ఉత్సాహ‌ప‌రిచేలా మాట్లాడారు. కార్యకర్తల త్యాగాలు తాను మర్చిపోనని, ఏ కష్టం వచ్చినా అండగా ఉంటానని స్పష్టం చేశారు.

సంపద సృష్టించడం తెలిసిన పార్టీ టీడీపీఅని.. సంపద పేదలకు పంచడం తెలిసిన పార్టీ టీడీపీ అని చంద్రబాబు వ్యాఖ్యానించారు. జ‌గ‌న్ పాల‌న‌లో సంపద దోపిడీ ఎక్కువ.. ధరల బాదుడు ఎక్కువని విమర్శించారు. స్కాముల్లో జగన్‌ మాస్టర్ మైండ్ అని, సీఎం నోరు తెరిస్తే అన్నీ అబద్దాలేని, కోడికత్తి డ్రామా.. మద్య నిషేధం వంటివన్నీ డ్రామాలేనని ఎద్దేవా చేశారు.

రావణాసురుడు సాధువు రూపంలో వచ్చి సీతను ఎత్తుకెళ్లినట్టు.. ఒక్క ఛాన్స్ అంటూ జగన్ ఓట్లేయించుకు న్నారని విమర్శించారు. రూ 2 వేల నోట్లన్నీ జగన్ దగ్గరే ఉన్నాయని, పెద్ద నోట్ల రద్దుకు టీడీపీ కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. సంక్షేమం తెలుసు.. సంపద సృష్టి తెలుసునని, అనేక సంక్షేమ కార్యక్రమాలు మొదలు పెట్టింది టీడీపీయేనని అన్నారు. పేదలకు ఫించన్లివ్వడం మొదలు పెట్టింది కూడా టీడీపీనే అన్నారు.

నాలుగేళ్ల క్రితం కొత్తగా వచ్చాడు.. ఒక్క ఛాన్స్ అన్నాడు, కోడి కత్తి అన్నాడు.. డ్రామా ఆడాడు.. రాష్ట్రాన్ని నాశనం చేయడం ప్రజా వేదిక నుంచే ప్రారంభించా“రని విమర్శించారు. అన్ని వ్యవస్థలను నాశనం చేశారని, ప్రపంచ చరిత్రలో ఎక్కడా రాజధాని లేని రాష్ట్రం లేదన్నారు. పోలవరాన్ని గోదావరిలో కలిపేశారని, రాష్ట్రంలో రోడ్లు ఆధ్వాన్నంగా మారాయని విమర్శించారు. ప్రభుత్వ స్పాన్సర్స్ టెర్రరిజం పెరిగిందని, పెట్టుబడులు లేవని.. జాబ్ క్యాలెండర్ లేదని, నిరుద్యోగులకు దిక్కు తోచడం లేదని అన్నారు.

పుట్టబోయే బిడ్డపైనా అప్పు వేసేలా ఉన్నారని, సంక్షేమం, అభివృద్ధి టీడీపీ సైకిలుకున్న రెండు చక్రాలని, నాలుగేళ్లపాటు టీడీపీ కార్యకర్తలు ఎన్నో కష్టాలు పడినా ఎవ్వరూ భయపడలేదన్నారు. జై జగన్ అంటే వదిలేస్తామన్నా.. వినకుండా జై తెలుగుదేశం అంటూ ప్రాణాలొదిలిన కార్యకర్తలూ ఉన్నారన్నారు. కార్యకర్తల త్యాగాలకు సెల్యూట్ చేస్తున్నానని, భవిష్యత్తులో కార్యకర్తలని ఆదుకునే బాధ్యత తనదని చంద్రబాబు స్పష్టం చేశారు.