తెలంగాణ కాంగ్రెస్ – గట్టి ప్లానింగే !

ఈనెల 26వ తేదీన తెలంగాణా కాంగ్రెస్ సీనియర్ నేతలందరినీ అధిష్టానం పిలిపించింది. అందరినీ ఢిల్లీకి రమ్మని ఆదేశించింది. పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధి, ప్రియాంకగాంధి తదితరులు తెలంగాణా నేతలతో భేటీ అవటానికే రమ్మని ఆదేశించారు. తొందరలో జరగబోతున్న ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించేందుకు, దిశానిర్దేశం చేసేందుకే కీలకమైన భేటీ ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. ఈ మధ్యనే జరిగిన కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే.

కర్నాటక ఎన్నికల్లో పార్టీ ఘన విజయం సాధించిన విధానాలను, అనుసరించిన వ్యూహాలను వివరించి అదే ఫార్ములాను తెలంగాణాలో కూడా అమలుచేసేట్లుగా సీనియర్ నేతలను ఆదేశించబోతున్నట్లు సమాచారం. కర్నాటక ఫార్ములా అంటే నేతలందరినీ ఏకతాటిపైకి తీసుకురావటం, అభ్యర్ధుల ఎంపిక విషయంలో ఎలాంటి వివాదాలకు తావులేకుండా చూసుకోవటం, ప్రచారం విషయంలో అందరు కలిసికట్టుగా ఉండటం, ఎన్నికల కోసం ఖర్చుచేసే నిధులను చివరిదాకా అందేట్లు చూడటం, అధికార పార్టీ చేసిన తప్పులను నూరుశాతం జనాలకు అర్ధమయ్యేట్లు వివరించి చెప్పటం.

అలాగే పార్టీ ప్రచారాన్ని, హామీలను జనాలందరికీ చేరేట్లుగా అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలన్నది కీలకం. చివరగా సోషల్ మీడియాను సమర్ధవంతంగా ఉపయోగించుకోవటం కూడా చాలా కీలకమన్న విషయాన్ని అధిష్టానం గుర్తించింది. గతంలో జరిగిన ఇతర రాష్ట్రాల ఎన్నికల్లో సోషల్ మీడియాను కర్నాటకలో ఉపయోగించుకున్నంతగా ప్రభావవంతంగా ఉపయోగించుకోలేదు. అందుకనే రేపటి తెలంగాణా ఎన్నికల్లో సోషల్ మీడియా ప్రచారాన్ని ఎంత వీలైతే అంత ఎక్కువగా ఉపయోగించుకోవాలని అధిష్టానం స్పష్టం చేయబోతోందని సమాచారం.

అయితే కర్నాటకలో సీనియర్లు ఏకతాటిపైన నడిచినట్లు తెలంగాణాలో సాధ్యమేనా అన్నది మిలియన్ డాలర్ల ప్రశ్న. పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిని దింపేసి ఆ పదవిలో కూర్చోవాలని చాలామంది సీనియర్లు రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి, జగ్గారెడ్డి, భట్టి విక్రమార్క లాంటి వాళ్ళతో రేవంత్ కు ఏమాత్రం పడటంలేదు. మరి సీనియర్ల మధ్య వివాదాలను ఏ విధంగా పరిష్కరిస్తుందనేది ఆసక్తిగా మారింది. తాజాగా కోమటిరెడ్డి మాట్లాడుతు కాంగ్రెస్ కు 80 సీట్లు ఖాయమని జోస్యం చెప్పారు. చెప్పటమేనా దాన్ని సాధించే మార్గముందా అన్నదే కీలకం.