‘దేవుడి య‌జ్ఞాన్ని రాక్ష‌సులు అడ్డుకుంటున్నారు’

Jagan Mohan Reddy Serious On His MLAs

ఏపీ ప్ర‌తిప‌క్ష నాయ‌కుల‌పై వైసీపీ అదినేత‌, సీఎం జగ‌న్ విరుచుకుప‌డ్డారు. దేవుడు చేస్తున్న య‌జ్ఞాన్ని (సంక్షేమ ప‌థ‌కాలు) రాక్ష‌సులు(ప్ర‌తిప‌క్షాలు) అడ్డుకుంటున్నార‌ని ఆయ‌న సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. పేదల ఇళ్ల పంపిణీని అడ్డుకునే యత్నం చేశారని చంద్రబాబు తీరుపై మండిపడ్డారు. పేదలకు పంచబోయే భూమిని సమాధులతో పోలుస్తారా? అని చంద్రబాబును ప్ర‌శ్నించారు.

అలాంటి మానవత్వం లేని, వికృత ఆలోచనలను ఉన్న వ్యక్తులకు మద్దతు ఇస్తారా? అంటూ సోమవారం మచిలీపట్నం బహిరంగ సభ ద్వారా ఏపీ ప్రజలను ఉద్దేశించి ప్ర‌శ్నించారు. కొన్ని లక్షల కుటుంబాలకు స్వాతంత్య్రం వచ్చి ఇన్నేళ్లు అయినా ఇల్లు లేద‌ని చెప్పారు. పేదవాడు పేదవాడిగా మిగిలిపోకూడదనేది త‌మ‌ ప్రభుత్వ ఆకాంక్షగా పేర్కొన్నారు. అందుకే అమరావతిలో పేదలకు ఇళ్ల పట్టాలు ఇవ్వాలని రెండేళ్ల కిందట నిర్ణయించామ‌ని తెలిపారు.

కానీ, చంద్రబాబు ఆయ‌న  దొంగల ముఠా దానిని అడ్డుకునే యత్నం చేసిందని విరుచుకుప‌డ్డారు. అయినా అన్ని సమస్యలు, కోర్టు కేసులు అధిగమించి పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వబోతున్నామని తెలిపారు. పేదలకు ఏనాడూ సెంటు భూమి కూడా ఇవ్వని చంద్రబాబు నాయుడుకు.. వాళ్ల కష్టాలు ఎలా తెలుస్తాయని సీఎం జగన్‌ అన్నారు. అమరావతిలో 50 వేలమంది పేదలకు ఇళ్ల స్థలాలు మంజూరు చేశామని, ఈ నెల 26వ తేదీన స్థలాల పంపిణీ ఉంటుందని ప్రకటించారు.

“చంద్రబాబు.. గతంలో ఎస్సీ కులాల్లో పుట్టాలని ఎవరైనా అనుకుంటారా? అని అన్నాడు. బీసీల తోకలు కత్తిరించాలని అన్నాడు. కోడలు మగ పిల్లాడిని కంటే అత్త వద్దంటుందా అని అన్నాడు. మూడు రాజధానులు వద్దు అంటూ అన్ని ప్రాంతాల అభివృద్ధినే అడ్డుకున్నాడు.  మూడు ప్రాంతాలమీదే దాడిచేశాడు. పేదలంటే చంద్రబాబుకు చులకన. బాబు కోరుకున్న అమరావతి ఎలాంటిదంటే.. అందులో పేదలు కేవలం పాచిపనులు చేయాలంట. రోజూవారీ పనులు చేసే కార్మికులుగా మాత్రమే ఉండాలట“ అని సీఎం జ‌గ‌న్ ఎద్దేవా చేశారు.

దారుణమైన మనస్తత్వం ఉన్న రాక్షసులతో తాను యుద్ధం చేస్తున్నాన‌ని సీఎం జ‌గ‌న్ చెప్పారు.  వారి వికృతఆలోచనలకు మద్దతు ఇవ్వగలమా? అని ప్రజలను ఉద్దేశించి   ప్రశ్నించారు. ఎన్ని ఇబ్బందులు వ‌చ్చినా.. ఎవ‌రు ఎన్ని అడ్డంకులు సృష్టించినా.. పేద‌ల‌కు ప‌ట్టాలు ఇచ్చి తీరుతామ‌ని సీఎం జ‌గ‌న్ చెప్పారు.