ముందు ఉట్టికెక్కుదాం.. తర్వాతే స్వర్గానికి…

ఉట్టికెక్కలేనమ్మా, స్వర్గానికి ఎక్కుతుందన్నది పాత సామెత. ఇప్పుడు తెలంగాణలో అధికార బీఆర్ఎస్ ఆ సామెతను గుర్తు చేసుకుంటోంది. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ గెలిచిన తర్వాత నేల విడిచి సాము చేస్తే తమకు కూడా బీజేపీకి పట్టిన గతే పడుతుందని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అర్థం చేసుకున్నారు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ను పోటీ పెట్టకుండా తెలివిగా పరువు కాపాడుకున్న కేసీఆర్, సమీప భవిష్యత్తులో కూడా ఆచి తూచి అడుగులు వేయాలని నిర్ణయించుకున్నారు.

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ గెలుస్తుందని కేసీఆర్ లెక్కలేసుకున్నారట. జేడీఎస్ సీట్ల సంఖ్య పెరుగుతుందని అనుకున్నారట. ఆ రెండు పనులు జరగకపోవడంతో ఇప్పుడు కేసీఆర్ కు తత్వం బోధపడింది. ఇప్పుడిక ఇతర రాష్ట్రాలపై దృష్టి పెట్టేకంటే స్వరాష్ట్రం తెలంగాణలో ఓడిపోకుండా చూడటం ప్రధాన కర్తవ్యమని బీఆర్ఎస్ డిసైడైంది. అందుకే ఈ ఏడాది ఆఖరు వరకు మహారాష్ట్రలో కూడా స్పీడు తగ్గించాలని కేసీఆర్ భావిస్తున్నారు. ఒకటి రెండు కార్యక్రమాలు మినహా మేజర్ ఈవెంట్లు ఏవీ పెట్టుకోకూడదని కేసీఆర్ తన అనుచరులకు ఆదేశించారు. రాష్ట్ర ఎన్నికల ముందు ఎలాంటి పొరబాట్లు జరిగినా అది విపక్షాలకు అడ్వాండేజ్ గా మారుతుందని బీఆర్ఎస్ భయపడుతుంది..

బీఅర్ఎస్ అధినేత కేసీఆర్ రేపు (బుధవారం) కీలక నిర్ణయాలు ప్రకటించే అవకాశం ఉంది. పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలతో సమావేశమై భవిష్యత్ కార్యాచరణపై వారికి దిశానిర్దేశం చేస్తారు. తెలంగాణ ఆవిర్భావ దశాబ్ది వేడుకలను జూన్ 2 నుంచి నిర్వహించాల్సిన తరుణంలో దానిపై కార్యక్రమాల రూపకల్పనకు సమావేశం ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పినప్పటికీ…. అసలు అజెండా వేరే ఉందని తేలిపోయింది. 20 రోజుల్లో రెండో సారి జరుగుతున్న సమావేశంలో అవినీతిపరులకు మరో సారి వార్నింగ్ ఇచ్చే అవకాశం ఉంది. ఎన్నికలకు సమాయత్తం కావాల్సిన సూచనలు కూడా కేసీఆర్ వైపు నుంచి రావచ్చని చెబుతున్నారు…