అవకాశాన్ని వాడుకుంటున్న ఆమంచి

శత్రువు బలహీనపడినప్పుడే బలంగా కొట్టాలంటారు. అన్ని వైపుల నుంచి కమ్ముకోవాలంటారు. అప్పుడే పాత కక్షలన్నీ తీర్చుకోవాలంటారు. చీరాల మాజీ ఎమ్మెల్యే, వైసీపీ పర్చూరు ఇంఛార్జ్ ఆమంచి కృష్ణమోహన్ ఇప్పుడు అదే పని చేస్తున్నట్లుగా అనిపిస్తోంది. జగన్ మీద అలిగి పదవికి రాజీనామా చేసిన మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డిని అన్ని వైపుల నుంచి దెబ్బ తీసేందుకు ఆమంచి కృష్ణమోహన్ ఇప్పుడు చేయని ప్రయత్నంలేదు. వీలైతే కుమ్మెయ్యాలన్నంత కోపంగా ఆయన ప్రవర్తిస్తున్నారు. దానితో ఇద్దరు నేతల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. పర్చూరు రాజకీయం వైసీపీలో హాట్ టాపిక్ గా మారింది.

గత ఎన్నికల్లో చీరాల స్థానం నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసిన ఆమంచి కృష్ణమోహన్ ఓటమి పాలయ్యారు. వైసీపీ అధికారంలోకి రావడంతో ఆమంచి చీరాలలో పెత్తనం చలాయించారు. ఆమంచి దూకుడును అడ్డుకోవడంలో శ్రీనివాసరెడ్డి చాలా వరకు సక్సెస్ అయ్యారు. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో తన పెత్తనమే సాగాలని బాలినేని భావించడంతో చాలా కాలం ఆమంచిని అణిచివేసి ఉంచారు.

ఏడాది తిరిగే సరికి టీడీపీ నుంచి గెలుపొందిన కరణం బలరామ్ వైసీపీ ప్రభుత్వానికి మద్దతు పలికి టీడీపీకి దూరమయ్యారు. దీంతో ఆమంచి చేతుల్లో ఉన్న చీరాల పెత్తనం కరణం బలరామ్ చేతుల్లోకి వెళ్లిపోయింది. కరణం బలరామ్‌ని వెనుక నుంచి మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి నడిపిస్తున్నారని ఆమంచి కొంత కాలంగా అనుమానిస్తూ ఉన్నారు. కరణం కారణంగా కొంత కాలంగా చీరాలలో ఆమంచి కృష్ణమోహన్‌ సైలెంట్ అయిపోయారు. పలు హైడ్రామాల మధ్య ఐదు నెలల క్రితం ఆమంచి కృష్ణమోహన్‌కి పర్చూరు నియోజక వర్గ బాధ్యతలు అప్పగించారు. దానితో బాలినేని వర్గాన్ని ఓ ఆట ఆడుకునేందుకు ఆమంచికి అవకాశం వచ్చింది.

బాలినేని శ్రీనివాసరెడ్డిని వ్యతిరేకించే వైవీ సుబ్బారెడ్డి వర్గంలో చేరిన ఆమంచి ఇప్పుడు విజృంభిస్తున్నారు. పర్చూరు ఇన్‌చార్జ్‌ బాధ్యతలు చేపట్టిన తరువాత నియోజక వర్గంలోని బాలినేని అనుచరులైన నాయకులపై ఫోకస్‌ పెట్టినట్లు పార్టీలోని వర్గాలే చెబుతున్నాయి. వారిని వేధించడమే పనిగా పెట్టుకున్నారు. బాలినేనితో సన్నిహితంగా ఉండే వారి జాబితాను రూపొందించి వారికి పనులు కాకుండా అడ్డుకుంటున్నారని వార్తలు వస్తున్నాయి. మండల, గ్రామ స్థాయిల్లో చేసిన పనులకు ఇప్పటికీ బిల్లులు రాక ఆర్థిక ఇబ్బందుల్లో చిక్కుకుంటే…వచ్చే బిల్లులను కూడా విడుదల కానీయకుండా ఆమంచి కృష్ణమోహన్‌ అడ్డుపడుతున్నారని బహిరంగంగానే ఆరోపిస్తున్నారు.

నియోజక వర్గంలో ఆమంచి గ్రావెల్, ఇసుక, మైనింగ్ మాఫియాలు నడుపుతున్నాడని.. పార్టీలో తనకు అడ్డు వస్తారనుకున్న వారందరినీ వేధిస్తున్నాడని బాలినేని వర్గానికి చెందిన నేతలు ఆరోపిస్తున్నారు. బాలినేని శ్రీనివాసరెడ్డిని నేరుగా ఎదుర్కొనలేక ఆయన అనుచరులపై ఆమంచి కృష్ణమోహన్ వేధింపులకు పాల్పడుతున్నాడని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బాలినేని వర్గం ఇప్పుడు ఆమంచిపై తిరుగుబాటు జెండా ఎగురవేసింది. మరి తాడేపల్లి ప్యాలెజ్ ఇలాంటి కార్యక్రమాలపై నిఘా పెట్టిందో లేదో…