మోడీ ఆటలకు సుప్రింకోర్టు ధర్మాసనం చెక్ పెట్టేసింది

లెఫ్ట్ నెంట్ గవర్నర్ (ఎల్జీ)ను అడ్డు పెట్టుకుని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ను ఆడించినంత కాలం ఆడించారు నరేంద్రమోడీ. మోడీ ఆటలకు సుప్రింకోర్టు ధర్మాసనం చెక్ పెట్టేసింది. ఢిల్లీ రాష్ట్రంపై పాలనాధికారం ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వానిదే అని స్పష్టంగా చెప్పేసింది. ఎల్జీ హోదాలో ప్రభుత్వాన్ని పక్కనపెట్టేసి పాలనలో, జనాలపై పెత్తనం చేస్తామంటే కుదరదని సుప్రింకోర్టు తేల్చిచెప్పింది. పలనా వ్యవహారాల్లో ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వానిదే అంతిమ నిర్ణయమని ధర్మాసనం స్పష్టంగా ప్రకటించింది.

విషయం ఏమిటంటే చాలాకాలంగా అరవింద్ కేజ్రీవాల్ అంటే మోడీకి బాగా మంటుంది. వరుసగా మూడోసారి సీఎం అయిన కేజ్రీవాల్ ను చివరి రెండుసార్లు ఓడించేందుకు మోడీ ఎంత ప్రయత్నించినా సాధ్యంకాలేదు. ఆ మంటను మనసులో పెట్టుకుని ఎల్జీని అడ్డంపెట్టుకుని మోడీ బాగా ఇబ్బందులు పెడుతున్నారు. అసెంబ్లీ, ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా ఎల్జీ దాన్ని అడ్డుకుంటున్నారు. తన ఆమోదముద్ర లేనకపోతే ఏ నిర్ణయం చెల్లదని, ఒక్క పనికూడా ముందుకు పోకూడదని ఎల్జీ పట్టుబట్టారు.

జనాల దృష్టిలో కేజ్రీని అసమర్ధుడిగా చిత్రీకరించటమే మోడీ టార్గెట్. ఎల్జీని అడ్డం పెట్టుకుని మోడీ తనను ఇబ్బందులు పెడుతుండటాన్న కేజ్రీ కూడా ఎప్పటికప్పుడు ఎండగడుతునే ఉన్నారు. ఇందులో భాగంగానే సుప్రింకోర్టులో కేసు వేశారు. దీనిపై సింగిల్ బెంచ్ తీర్పుచెబుతు ఎల్జీకి అన్నీ అధికారాలు ఉన్నాయని చెప్పింది. ఎల్జీ చెప్పినట్లే ప్రభుత్వం నడుచుకోవాలని ఆదేశించింది. దీనిపై కేజ్రీ రివ్యూ పిటీషన్ వేస్తే దాన్ని ఐదుగురు సభ్యుల ధర్మాసనం విచారించింది.

తన తాజా తీర్పులో సింగిల్ బెంచ్ తీర్పును రద్దుచేసింది. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాన్ని కాదని కేంద్రప్రభుత్వం నియమించిన ఎల్జీకి అధికారాలు ఎలాగుంటాయని నిలదీసింది. ప్రజలకు ప్రభుత్వమే జవాబుదారీ కానీ ఎల్జీ కాదన్నది. అందుకనే ఎల్జీ పెత్తనం ఇక ఎంతమాత్రం చెల్లదని స్పష్టంగా చెప్పేసింది. తాజా తీర్పుతో మోడీకి వ్యతిరేకంగా కేజ్రీ రెచ్చిపోవటం ఖాయం. పార్లమెంటు ఎన్నికలకు ముందు సుప్రింకోర్టు తీర్పు కేజ్రీకి పెద్ద బూస్టప్ ఇచ్చినట్లనే చెప్పాలి. మరి రాబోయే ఎన్నికల్లో కేజ్రీ ఏమిచేస్తారో చూడాలి.