‘ఎర్రిపప్పా.. మొలకలొస్తే నేనేం చేస్తా’ ఏపీ మంత్రి

అధికారం అహంకారాన్ని ఇవ్వకూడదు. బాధ్యతను పెంచాలి. ఈ విషయాన్ని కీలక స్థానాల్లో ఉన్న నేతలు ఎలా మరిచిపోతారు? తామున్నదే ప్రజలకు సేవ చేయటానికి అంటూ ఓట్లు వేయమని అడిగి మరీ ఎన్నికైన వారు.. తమకు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలే కానీ.. నోరు పారేసుకోకూడదు. కానీ.. కొందరు నేతల తీరు చూస్తే.. మరీ ఇంత అహంకారం అవసరమా? అన్న భావన కలిగేలా ఉంటుంది. తాజాగా ఏపీకి చెందిన మంత్రి కారుమూరి నాగేశ్వరరావు మాటలు ఇదే తీరులో కనిపిస్తాయి.

అకాల వర్షాలతో ఏపీలోని రైతులు ఆగమాగం అవుతున్నారు. కళ్ల ముందే పంట తడిచిపోయిన వారు కొందరైతే.. మరికొందరి పంటలు దారుణంగా దెబ్బ తిన్నాయి. అకాల వర్షాలతో ఎక్కువమంది రైతుల కంట కన్నీరు కారుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో సాయం చేయటం తర్వాత.. ఊరడింపు మాటలతో వారిలో మనోధైర్యాన్ని పెంచాల్సిన అవసరం ఉంది. అందుకు భిన్నంగా నోరు పారేసుకోవటం ఏ మాత్రం మంచిది కాదు.

పశ్చిమగోదావరి జిల్లా తణుకులో జరిగిన ఒక కార్యక్రమానికి హాజరయ్యారు రాష్ట్ర పౌరసరఫరాల శాఖా మంత్రి కారుమూరి నాగేశ్వరరావు. ఈ సందర్భంగా ఆయన వద్దకు వచ్చిన ఒక రైతు అకాల వర్షాలతో తన ధాన్యం తడిచిపోయి.. మొలకొచ్చిందని వేదన వ్యక్తం చేశారు. ఈ మాటకు సదరు మంత్రికి విపరీతమైన కోపం వచ్చింది. ఆగ్రహంతో ఊగిపోయిన ఆయన.. ఎర్రిపప్పా.. మొలకలొస్తే నేనేం చేస్తానంటూ విరుచుకుపడ్డారు.

వేదనతో తమ సమస్యల్ని చెప్పుకోవటానికి వచ్చిన రైతు మీద అలా నోరు పారేసుకోవటం ఏమిటి? అంటూ మండిపడుతున్నారు. వర్షం కారణంగా పంటలు నష్టపోయిన వేళ.. వేదనతో తమ కష్టాన్ని చెప్పుకోవటానికి వచ్చిన అన్నదాతో మంత్రి అలా మాట్లాడతారా? అంటూ ప్రశ్నిస్తున్నారు. మంత్రి నోటి నుంచి వచ్చిన మాట వైరల్ గా మారటంతో ఆయన నష్ట నివారణ చర్యలుచేపట్టినట్లు చెబుతున్నారు.

తన వద్దకు వచ్చిన రైతులతో తాను చక్కగానే సమాధానం చెప్పానని.. వైరల్ అవుతున్న వీడియోలో ఉన్న వ్యక్తి రైతు కాదని.. తాగుబోతు అని చెప్పారు. కావాలని తన వద్దకు వచ్చి మాట్లాడాడని చెప్పిన మంత్రి.. అయినా తాను మాట్లాడినదేమీ బూతు కాదు కదా? అంటూ సమర్థించుకునే వైనం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.